పేదరిక నిర్మూలన కేవలం నినాదం కారాదు

ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన అనేది కేవలం నినాదప్రాయం కారాదని, దీనితో పాటు పలు సవాళ్లు కూడుకుని ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగా తెలిపారు.  ఇప్పుడు జరుగుతోన్న జి 20 ఫైనాన్స్ ట్రాక్ (ఆర్థిక మంత్రులు, ప్రధాన బ్యాంకుల గవర్నర్ల) సమావేశం నేపథ్యంలో మాట్లాడుతూ ముందు హెచ్చుతగ్గులు లేకుండా ఈ భూమి అందరికీ నివాసయోగ్య గ్రహం కావాల్సి ఉందని స్పష్టం చేశారు. 

పర్యావరణ మార్పులు, మహమ్మారిలు, ఆహార అభద్రత, బలహీనతల వంటి పలు అంశాలను సవాళ్లుగా తీసుకోవల్సి ఉందని సూచించారు. ఇవన్నీ మిళితం అయ్యి ఉంటాయని, వీటిని పూర్తి స్థాయిలో పరిశీలించుకుంటేనే పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. ప్రపంచబ్యాంక్ తన ముందు ఉన్న నిర్ధేశిత లక్షాలను మరింతగా విస్తృతపర్చుకోవల్సి ఉంటుందని చెబుతూ ఇప్పటివరకూ కేవలం పేదరిక నిర్మూలన ఒక్కటే లక్ష్యంగా ఉందని గుర్తు చేశారు. దీనిని మించి మనం ఈ ప్రపంచాన్ని పేదరిక నిర్మూలన దశ నుంచి దాటించడమే కాకుండా, ఇది నివాస యోగ్యం కావాల్సి ఉందని పేర్కొన్నారు. 

భారతీయ సంతతికి చెందిన బంగా ఈ సందర్భంగా భారత్ పురోగతి గురించి ప్రస్తావిస్తూ భారతదేశంలో అభివృద్ధి కేవలం కేంద్రీకృతం అవుతున్నట్లుగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. మున్సిపల్ స్థాయి లేదా స్థానిక ప్రాతిపదికగా సాగే ఆర్థిక ప్రక్రియతోనే దేశ ప్రగతి పరిపూర్ణం అవుతుందని సూచించారు. 

వివిధ స్థాయిల్లోకి మౌలిక సాధనసంపత్తి, ఏర్పాట్లు విస్తరించుకుని తీరాలని పేర్కొంటూ దీనికి మున్సిపాలిటీలు ప్రాతిపదిక కావల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక క్లిష్టతల పరిష్కారానికి కేంద్రీకృత వైఖరితో సాగే ఆర్థిక చర్యల వల్ల సమగ్ర ప్రగతి సాధ్యం కాదని హెచ్చరించారు, సరికొత్తగా పలు నగరాలు, పట్టణాలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమకూరాల్సి ఉంటుందని చెప్పారు.

భారత్ లో నిర్థిష్ట రంగాలను ఎంచుకునే ప్రైవేటు రంగ పెట్టుబడులు వస్తున్నాయని చెబుతూ  ప్రత్యేకించి నగరాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి దిశలో ప్రైవేటు పెట్టుబడులు ఏ మేరకు వస్తున్నాయనేది విశ్లేషించుకోవల్సి ఉందని బంగా సూచించారు. తరచూ పిలుస్తూ పోతూ ఉంటే ప్రైవేటు పెట్టుబడులు రానే వస్తాయని, అయితే వీటి వల్ల ఏ మేరకు సత్పలితాలు అందుతున్నాయనేది తేల్చుకోవల్సి ఉందని హితవు చెప్పారు.

ఈ నెల 17, 18 తేదీలలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో భారత్ సారధ్యపు జి 20 తరఫున సభ్య దేశాల ఆర్థిక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు భేటీ (జి20ఎఫ్‌ఎంసిబిజి) జరుగుతుంది. ఈ సమావేశానికి సభ్య దేశాల ఆర్థిక మంత్రులు తరలివస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంయుక్తంగా ఈ మూడవ ఎఫ్‌ఎంసిబిజి భేటీకి అధ్యక్షత వహిస్తారు.