ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి

జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కుల వివక్ష ఘటనపై  గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్, జగదేవపూర్ తహసిల్దార్ రఘువీరా రెడ్డి, ఎస్ఐ కృష్ణమూర్తి, గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్న వివిధ వర్గాల వివిధ కులాల కుల పెద్దలు అందరినీ పిలిపించి  ఎస్సీ కాలనీలో సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆర్డీవో విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమని పేర్కొంటూ గ్రామాలలో ఎలాంటి కుల వివక్షత చూపించవద్దని హితవు చెప్పారు.  గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలకు అందరూ వెళ్లవచ్చని, హెయిర్ కటింగ్ అందరికీ షాపులలోనే చేయాలని సూచించారు. 
 
భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం నడుచుకోవడం మన అందరి బాధ్యతని తెలిపారు. గ్రామాలలో ఎలాంటి కుల వివక్షత చూపించవద్దని సూచించారు. కుల వివక్షత చూపించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. త్వరలో గ్రామంలో అందరూ పెద్దలు కలిసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 
 
గజ్వేల్ ఏసిపి రమేష్ మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమేనని, ఎవరు కూడా కుల వివక్ష పాటించవద్దని సూచించారు.  సోషల్ మీడియాలో వచ్చే   షికార్లు, పుకార్లు నమ్మవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో ఒక వర్గానికి కానీ ఒక కులానికి ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
వ్యక్తిగత కక్షలు ఉంటే కుల వివక్షతో ముడి పెట్టవద్దని సూచించారు. ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.  గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలని తెలిపారు. ప్రతి సమస్యను రాజకీయ ధోరణితో చూడవద్దని సూచించారు. గ్రామంలో ఉన్న అన్ని కులాల మతాలవారు కలిసిమెలిసి ఉండి  గ్రామ అభివృద్ధికి మరింత పాటుపడాలని తెలిపారు.
 
 గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా  అధికారుల దృష్టికి తీసుకుని రావాలని  గ్రామస్తులకు వివిధ కుల పెద్దలకు సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం  ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించాలని సూచించారు.