ఇస్కాన్ సాధువుపై నెలరోజుల పాటు నిషేధం

స్వామి వివేకానందపై అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) సాధువు అమోఘ్ లీలా దాస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. లీలా దాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు తావివ్వడంతో ఆయనపై ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఒక నెల రోజుల పాటు లీలా దాస్‌ను సంస్థ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

అమోగ్ లీలా దాస్ ఆధ్యాత్మిక ప్రవచనాలకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది.  లీలాదాస్ ఇటీవల చేసిన ఒక ప్రవచనంలో స్వామి వివేకానంద ప్రస్తావన చేస్తూ, ఆయన చేప తినడాన్ని ప్రశ్నించారు. సద్గుణ వంతులు ఎప్పుడైనా చేపను తింటారా? చేపకు కూడా బాధ ఉంటుంది, అవునా? అప్పుడు సద్గుణవంతులు చేపను తింటారా?” అని ప్రశ్నించారు. 

స్వామి వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంసపై కూడా లీలాదాస్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపడంతో ‘ఇస్కాన్’ వెంటనే స్పందించింది. లీలాదాస్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసింది.  స్వామి వివేకానందం, రామకృష్ణ పరమహంస బోధలపై అవగాహన లేకుండా అమోఘ్ లీలాదాస్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని ఒక ప్రకటనలో తెలిపింది.

నెలరోజుల పాటు సంస్థ నుంచి ఆయనను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. లీలాదాస్ తన వ్యాఖ్యలకు క్షమాపణ అడగాలని, నెలరోజుల పాటు గోవర్ధన్ కొండల్లో ప్రాయశ్చిత్తం చేసుకుంటానని ప్రతిన చేయాలని పేర్కొంది. ప్రజాజీవితానికి దూరంగా ఆయన పూర్తిగా ఏకాంతంలోకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు ఆ ప్రకటన పేర్కొంది.