టివి న్యూస్ యాంకర్ గా రోబో లిసా!

ఇప్పుడు కొత్తగా మీడియా రంగంలోకి కూడా కుత్రిమ మేధస్సు వచ్చి చేరింది. ఇంతవరకు విదేశాల్లో మాత్రమే దీని ద్వారా న్యూస్ చదివే యాంకర్లను చూశాం. ఇప్పుడిప్పుడే భారత్‌లోనూ ఈ ట్రెండ్ మొదలయ్యింది. ఈ మధ్యనే కొన్ని జాతీయ ఛానెళ్లు రోబోన్యూస్ యాంకర్స్‌ను పరిచయం చేయగా, ఇప్పుడు ప్రాంతీయ ఛానెల్స్‌లోనూ రోబో న్యూస్‌ యాంకర్‌ కాలుమోపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాజాగా ఒడిశా మీడియా రంగంలోకి దూసుకువ‌స్తున్న‌ది. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని ఓ న్యూస్ ఛానెల్లో తొలి రోబో న్యూస్ యాంకర్‌ వార్తలు చదివి అందరినీ ఆశ్చర్యపర్చింది. భువనేశ్వర్‌కు చెందిన ఒడిశా టెలివిజన్ నెట్‌వర్క్ (ఓటివి) యాజమాన్యం ఈ న్యూస్‌ యాంకర్‌కు లిసా అని పేరు పెట్టింది. ఈ న్యూస్ యాంకర్ ఒడిశా సాంప్రదాయ చేనేత చీర ధరించి అచ్చం భారతీయ యువతిలా కనిపించింది. ఇంగ్లిష్‌తోపాటు ఒరియాలోనూ వార్తలు చదివి అబ్బురపర్చింది.
అచ్చం మ‌హిళా యాంక‌ర్ లా ఉన్న రోబో గ‌డ గ‌డ వార్త‌లు చ‌దివి అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో తెరపై కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదని, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారుచేసిన బొమ్మ అని తెలిసి జనం ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
లేడీ యాంకర్ ను తలపించేలా గడగడా న్యూస్ చదివిన లీసా తీరు ఒడిశా ప్రజలను అబ్బురపరిచింది. ఒడిశాలో పేరొందిన న్యూస్ ఛానల్ ఓ టీవీ ఈ కొత్త యాంకర్ ను తన వీక్షకులకు పరిచయం చేసింది. ఒడిశాలో తొలి ఏఐ యాంకర్ ‘లిసా’తో వార్తలు చెప్పించింది. ఒడియాతో పాటు ఇంగ్లిష్ లోనూ వార్తలు చదివేలా లీసా ను ప్రోగ్రామ్ చేసినట్లు ఓ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జాగి మంగత్ పాండా పేర్కొన్నారు.
రాష్ట్రానికి మొట్టమొదటి ఏఐ యాంకర్ ను పరిచయం చేసిన ఘనత తమకే దక్కుతుందని ఆమె వివరించారు. లీసాకు బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లిష్ వార్తలపైనే దృష్టి పెట్టామని చెప్పారు. టీవీ బ్రాడ్ కాస్టింగ్ రంగంలో ఏఐ వాడకం ఇప్పుడిప్పుడే మొదలైందని, భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను చేరుకుంటుందని పాండా పేర్కొన్నారు.