చైనా జాగ్రత్తగా వ్యవహరించాలని బైడెన్ హెచ్చరిక

చైనా ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాల పెట్టుబడులపై ఆధారపడి ఉందనే విషయం మరిచిపోకూడదని, అందుకనే జాగ్రత్తగా వ్యవహరించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

జిన్ పింగ్ రష్యా పర్యటనపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “రష్యా ఉక్రెయిన్ లోకి ప్రవేశించినప్పటి నుంచి 600 అమెరికన్ కంపెనీలు ఆ దేశం నుంచి వైదొలిగాయి. చైనా ఆర్థిక వ్యవస్థ యూరప్, అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులపై ఆధారపడి ఉన్నట్టు మీరు (జిన్‌పింగ్ ) నాకు ఒక సందర్భంలో చెప్పారు” అని గుర్తు చేశారు. 

“మరి అయితే జాగ్రత్తగా ఉండండి. ఇది బెదిరింపుకాదు. కేవలం పరిశీలన మాత్రమే” అని తెలిపారు. అమెరికా చైనా మధ్య అనేక అంశాల్లో తీవ్రస్థాయి విభేదాలున్నాయి. తైవాన్, ఉక్రెయిన్ సంక్షోభం, సాంకేతిక పరమైన అంశ్లాలతో ఇరు దేశాల మధ్య సంబంధం బలహీనంగా ఉంది. రెండింటి మధ్య ఇటీవల చిప్ వార్ మొదలైంది. జాతీయ భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒకదానిపై ఒకటి ఆంక్షలు విధించుకుంటూనే ఉన్నాయి. 

ఇదిలా ఉండగా, అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ చైనా పర్యటనలో ఉన్నారు. మార్చిలో జిన్‌పింగ్ రష్యాలో రెండు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా చర్యలను అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తోన్న సమయంలో ఈ పర్యటన జరిగింది. దీంతో చైనా తీరుపై ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.