ఖలిస్థాన్‌ జెండా ఎగురవేస్తే ఐ-ఫోన్లు ఎర

సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ  ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ భవనాలపై తరచూ ఖలిస్థాన్‌ జెండా ఎగురవేస్తూ అందరి దృష్టిలో పడుతున్న నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు గురు పత్వంత్‌ సింగ్‌ పన్నూ తాజాగా కెనడా, అమెరికా, యూకేల్లో భారతీయ దౌత్యవేత్తలను బెదిరిస్తూ వెలిసిన పోస్టర్ల వెనక తన హస్తం ఉన్నట్లు వెల్లడించాడు.
 
ఖలిస్థాన్‌ జెండా ఎగురవేసేవారికి ఐ-ఫోన్లు, ఇతరత్రా బహుమతులను ఎరగా వేసి యువతను ఆకర్షిస్తుంటాడు. అంతటితో ఆగకుండా భారత నేతలను న్యాయపరంగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు.  2014లో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియాగాంధీ, సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌, పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌లపై అమెరికా, కెనడాల్లో కేసులు కూడా దాఖలు చేశాడు. ఈ కేసుల కారణంగానే అమరీందర్‌ సింగ్‌ 2016లో అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

తూర్పు లడఖ్‌ సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత డ్రాగన్‌కు మద్దతుగా పన్నూ ప్రకటన చేయడం సిక్కుల్లో చాలామందిలో ఆగ్రహం కలిగించింది. ‘‘చైనాకు సహానుభూతి ప్రకటిస్తున్నా.. గల్వాన్‌లో చైనా సైనికుల పట్ల భారత సైన్యం జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నాం’’ అంటూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు సంఘీభావం ప్రకటిస్తూ సందేశం పంపాడు.

తాజాగా, పన్నూ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే, న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ముందు పన్నూ నిల్చుని మాట్లాడుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు వస్తున్న వార్తలను అందులో అతడు తోసిపుచ్చాడు. 
 
ఇటీవల కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ తన సోదరుడని.. ఆయనతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు ఓ మీడియా సంస్థకు వెల్లడించాడు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో భారత్‌కు తలనొప్పిగా మారిన గురు పత్వంత్ సింగ్ స్వస్థలం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా ఖాంకోట్‌ గ్రామం. 
 
తండ్రి మహేందర్‌సింగ్‌ పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం పాకిస్థాన్‌ నుంచి ఇక్కడికి వచ్చింది. పన్నూది ధనిక కుటుంబం. వ్యవసాయ భూములు, విద్యా సంస్థలు ఉన్నాయి. ముగ్గురు సంతానంలో ఒకరైన పన్నూ గురించి గ్రామంలో ఎవరికీ పెద్దగా తెలియదు. 
 
పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తిచేసి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. ఆ దేశ పౌరసత్వం తీసుకొని అమెరికా, కెనడాల్లో న్యాయవృత్తిలో ప్రవేశించాడు. 2007లో కొందరితో కలిసి సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) అనే సంస్థను ప్రారంభించి మానవ హక్కుల కోసం ఏర్పాటుచేసిన సంస్థగా చెప్పుకున్నాడు.

పంజాబ్‌ను సిక్కుల స్వయంప్రతిపత్తి ప్రాంతంగా (ఖలిస్థాన్‌) ఏర్పాటుచేయటం తమ ఉద్దేశంగా పేర్కొన్నాడు. అప్పటి నుంచి విదేశాల్లో భారత వ్యతిరేక ప్రదర్శనలు, ఆందోళనలు సభలు, సమావేశాలకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తున్నాడు. కెనడా, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాల్లో భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.

 
ఎస్‌ఎఫ్‌జే చర్యలు హద్దులు శ్రుతి మించడంతో 2019లో ఈ సంస్థను కేంద్రం నిషేధించి. అనంతరం పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో రిఫరెండమ్‌-2020 పేరుతో ఖలిస్థాన్‌కు మద్దతు కూడగట్టేందుకు గురు పత్వంత్ సింగ్ చేసిన ప్రయత్నాల పాకిస్థాన్‌ మద్దతిచ్చింది. 
 
అదే ఏడాది అక్టోబరులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతికి కొద్దిరోజుల ముందు ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు చేస్తూ, జెండాలు ఎగరేయాల్సిందిగా సిక్కు విద్యార్థులకు పిలుపునిచ్చాడు. అందుకు ప్రతిఫలంగా వారికి ఐఫోన్‌-12 బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించాడు. ఖరీదైన బహుమతులు, డబ్బులను ఎరగా వేసి యువతరాన్ని ఖలీస్థాన్ వేర్పాటువాదవైపు ఆకర్షించడం పన్నూ వ్యూహంలో ఓ భాగం.