ఈ నెల 13న చంద్రయాన్-3 ప్రయోగం

ఈ నెల 13న చంద్రయాన్-3 ప్రయోగం
భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నెల 13 శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ మిషన్‌ను ప్రారంభించనున్నారు. ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇక ప్రయోగమే తరువాయి.  బుధవారం ఇందులో భాగంగా కీలకమైన క్యాప్సూల్ కలయిక జరిగింది.
చంద్రయాన్ 3 వాహకనౌకను ఎల్‌విఎం 3తో అనుసంధానించే ప్రక్రియ జరిగిందని ఇస్రో వర్గాలు బుధవారం తెలిపాయి. వాహకనౌకతో పేలోడ్ సంబంధిత ఎల్‌విఎంను అనుసంధానించడం కీలకమైన ఘట్టం అని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 2 తరువాత మరింత సమర్థతతో చంద్రుడివైపు యాత్రకు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) సిద్ధమైంది.
 
ప్రయోగం తర్వాత రెండు నెలలపాటు ప్రయాణించనున్న స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌తో దాని జర్నీ ముగుస్తుంది. ఆ తర్వాత జాబిల్లిపై పరిశోధనలు ప్రారంభమవుతాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతంలోనూ చంద్రయాన్‌ మిషన్లు చేపట్టింది. 
 
మొత్తం ప్రయోగంలో సాఫ్ట్‌ల్యాండింగ్‌ చాలా క్లిష్టమైన ప్రక్రియ. చంద్రయాన్‌-2 సాఫ్ట్‌లాండింగ్‌లో విఫలం కావడంతో చంద్రుడిపై కూలిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 ప్రయోగం కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.  సరైన సమయంలో సరైన వేగంతో సరైన ల్యాండింగ్‌ స్పాట్‌ను చేరుకోవడం కీలక పాత్ర పోషిస్తాయి.

చంద్రుడి ఉపరితలంపై సురక్షిత ల్యాండింగ్ , రోవింగ్ సామర్థాలను పూర్తి స్థాయిలో పరీక్షించుకునేందుకు చంద్రయాన్ 3 కీలకం అవుతుంది. బుధవారం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో అత్యంత కీలకమైన ఎల్‌విఎం అనుసంధాన ప్రక్రియ జరిగిందని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 13వ తేదీనే చంద్రయాన్ 3ని చేపట్టాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.