తెలంగాణతో పాటు మరో 3 రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుండి రెండు రోజుల పాటు తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో పలు ప్రాజక్టులకు ప్రారంభోత్సవాలు, మరికొన్ని ప్రాజక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 7న ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో మోదీ పర్యటించనున్నారు. 
ఛత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయపూర్‌లో రూ. 7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం, శంకుస్థాపన చేస్తారు. అలాగే వారణాసిలో రూ. 12,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఇక ఈనెల 8న (శనివారం) తెలంగాణతో పాటు రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటించను న్నారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ. 24,300 కోట్ల ప్రాజెక్టు పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. తెలంగాణలోని ఉదయం 10:45 గంటలకు వరంగల్ కు చేరుకుని రూ. 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు, పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 

ఇందులో భాగంగా రూ.5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు పునాది వేస్తారు. నాగపూర్,- విజయవాడ కారిడార్ కింద 108 కిలోమీటర్ల మంచిర్యాల- వరంగల్ సెక్షన్ కూడా ఒకటిగా ఉంది. దీంతో మంచిర్యాల, -వరంగల్ మధ్య దూరం దాదాపు 34 కిలోమీటర్లు తగ్గడమేగాక ప్రయాణ సమయం కూడా ఆదా కావడంతో సహా జాతీయ రహదారి 44, 65లలో వాహన రద్దీ తగ్గుతుంది.

రూ. 500 కోట్లతో వ్యాగన్‌ తయారీ పరిశ్రమకు శంకుస్థాపం చేస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అధునాతన యంత్రాలు, పరికరాలతో కూడిన సౌకర్యాలతో ఈ వ్యాగన్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రోబోటిక్‌ పెయింటింగ్‌తో వ్యాగన్ల తయారీ ఉంటుంది. అలాగే నాగపూర్‌- విజయవాడ జాతీయ రహదారిలో మంచిర్యాల-వరంగల్‌ సెక్షన్‌లో 108 కి.మీ రహదారి అభివృద్ధికి, కరీంనగర్‌-వరంగల్‌ సెక్షన్‌లో 68 కి.మీ రహదారి విస్తరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపం చేయనున్నారు.