విజయవాడ – చెన్నై మధ్య వందేభారత్ 7న ప్రారంభం

ఏపీలో రైలు ప్రయాణికులకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ- చెన్నై మధ్య వందేభారత్‌ రైలును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి కొత్త రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఏపీలో ప్రస్తుతం విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మధ‌్య వందేభారత్‌ ప్రయాణికులకు అందుబాటులోకి ఉంది. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య మరో రైలు నడుస్తోంది.
తాజాగా మరో రైలును ఏపీలో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు. కొత్త రైలు రేణిగుంట మీదుగా రాకపోకలు సాగించనుంది. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. వాటిల్లో విజయవాడ- చెన్నై మధ్య నడిచే కొత్త రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులకు తెలిపారు. కొత్త సర్వీసును ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైలు జులై 8వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభింస్తుందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే వందేభారత్‌ రైలుకు ఏయే స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుంది, రాకపోకల షెడ్యూల్‌, టిక్కెట్‌ ధరలు, ప్రయాణ సమయం వంటి షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.

కొత్త రైలును రేణిగుంట మీదగా నడపాలని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరినట్లు తెలిసింది. విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదగా చెన్నై వెళ్లి, అదే మార్గంలో తిరిగి రానుంది.

విజయవాడ- తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, వందేభారత్‌ను రేణిగుంట మీదగా నడపాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడ – చెన్నై మధ్య ఉన్న ఇంటర్‌ సిటీ రైలు ఆరున్నర గంటల్లో చెన్నై చేరుతోంది. కనిష్ట ప్రయాణ సమయంలో గమ్యస్థానాన్ని చేరుకునేలా షెడ్యూల్‌ ఖరారు చేసే అవకాశాలున్నాయి.