146 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం జగన్‌

ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆపద సమయంలో అత్యవసర సేవలు అందించే 108  అంబులెన్స్ వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన జవసత్వాలను చేకూర్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్ 146 కొత్త 108 అంబులెన్స్‌లను సోమవారం నాడు జెండా ఊపి ప్రారంభించారు.
 
నూత‌న అంబులెన్స్‌ల్లో ఉన్న అధునాతన వైద్యసౌకర్యాలను ప‌రిశీలించి వాటిలో కల్పించిన వైద్య సదుపాయాల గురించి అధికారులు సీఎం జగన్ కు వివరించారు.  జగనన్న ప్రభుత్వం 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసిందని, 2020లోనే మండలానికో 108ను అందుబాటులో ఉంచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 768 అంబులెన్స్‌లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని,  మరమ్మతులకు గురవుతున్న వాటి స్థానంలో కొత్త అంబులెన్స్‌లు సేవలు అందించనున్నాయని ఆమె  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోమహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషాశ్రీచరణ్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), కూడా పాల్గొన్నారు. 146 నూతన అంబులెన్స్‌లకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.34.79 కోట్లను ఖర్చు చేసింది.