ఉస్మానియా హాస్ప‌ట‌ల్ లో గ‌వ‌ర్న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ

ఉస్మానియా నూతన భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలంటూ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్న గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఆ హాస్ప‌ట‌ల్ ను సంద‌ర్శించారు. ఈ సందర్భంగా తమిళిసై భవనం నిర్మాణం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భావన  పరిస్థితిని డిప్యూటీ అధికారులు గవర్నర్‌ కు వివరించారు.
 
అనంతరం తమిళిసై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారితో మాట్లాడారు. సౌకర్యాలు, వైద్యం అందుతున్న తీరు.. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్ప‌ట‌ల్స్ వ‌స‌తులు స‌రిగా లేవ‌ని, న్యూరో స‌ర్జ‌న్ రూమ్ కు అస‌లు పైక‌ప్పు లేద‌ని గ‌వ‌ర్న‌ర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌న‌పై ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ప‌ట్టించుకోన‌ని, త‌న ల‌క్ష్యం పేద‌ల‌కు వైద్య సేవ‌లు స‌రిగా అంద‌ల‌నేదే త‌న త‌ప‌న అని గవర్నర్ పేర్కొన్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను పొగ‌డ‌టం త‌న బాధ్య‌త కాద‌ని తేల్చి చెప్పారు.
 
ఆ తర్వాత మీడియాతో గవర్నర్ మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి విషయంలో చొరవచూపిన కోర్టును అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని, ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.  జనరల్ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే పని చేస్తున్నాయని, ఎండవేడిని తట్టుకోలేక రోగులు పారిపోతున్నారని అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు రెండువేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారని, 200 వరకు సర్జరీలు చేస్తున్నారని చెప్పారు. 

ఆసుపత్రి భవనం కట్టి వంద ఏళ్లవుతోందని, కొత్త భవనం కట్టవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఇక్కడకు రాలేదని చెప్పారు. కాగా, గవర్నర్ కు ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. శశికళ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను, పాత భవనాన్ని ఆమె పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాగా గతంలో గవర్నర్‌ చేసిన ట్వీట్‌కి మంత్రి హరీష్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉండడం వల్ల మౌనంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.
 
మ‌రో విష‌యం ఏమిటంటే గ‌వ‌ర్న‌ర్ ఉస్మానియాను సంద‌ర్శిస్తున్న స‌మ‌యంలోనే హారీష్ రావు త‌న చాంబ‌ర్ లో వైద్య శాఖ అధికారుల‌తో ఉస్మానియాపై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష కార్య‌క్ర‌మం షెడ్యూల్ 20 రోజుల క్రిత‌మే ఖ‌రారు కాగా, ఈ విషయం తెలుసుకున్న గ‌వ‌ర్న‌ర్ నేడు ఆక‌స్మిక ఉస్మానియాను సందర్శించారంటూ బిఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.