జీఎస్టీ వసూళ్లు జూన్ లో 12 శాతం పెరుగుదల

జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్ల రికార్డు మార్క్ ను మరోసారి అధిగమించాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ పన్ను వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్లకు చేరడం ఇది నాలుగోసారి.
అలాగే, రూ. 1.50 లక్షల కోట్ల మార్క్ ను అధిగమించడం ఇది ఏడోసారి. 2023, జూన్ నెలలో దేశవ్యాప్తంగా రూ. 1,61,497 కోట్ల జీఎస్టీ వసూలయిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో రూ. 31,013 కోట్ల సెంట్రల్ జీఎస్టీ, రూ. 38,292 కోట్ల స్టేట్ జీఎస్టీ, రూ. 80,292 కోట్ల ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, రూ. 11,900 కోట్ల సెస్ వసూలయిందని వివరించింది.
రెగ్యులర్ సెటిల్మెంట్ అనంతరం జూన్ నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం రూ. 67,237 కోట్ల సెంట్రల్ జీఎస్టీ, రూ. 68,561 కోట్ల స్టేట్ జీఎస్టీ అని వివరించింది. 2023 జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు గత సంవత్సరం (2022) జూన్ నెల జీఎస్టీ వసూళ్ల కన్నా 12% అధికమని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇక తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్ల విషయానికొస్తే  తెలంగాణలో రూ.4,681.39 కోట్ల మేర వసూళ్లు జరిగాయి. గతేడాది రూ.3,901.45 కోట్లతో పోలిస్తే 20 శాతం మేర పెరిగాయి. గతేడాది ఏపీలో రూ.2,986.52 కోట్లు వసూళ్లు నమోదవగా, ఈ ఏడాది జూన్‌లో రూ.3,477.42 కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదైంది. ఎప్పటిలానే మహారాష్ట్ర రూ.26,098.78 కోట్ల (17 శాతం) వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది.