ఉమ్మడి పౌర స్మృతికు ఇప్పుడే సరైన సమయం

ఉమ్మడి పౌర స్మృతి చట్టం చేయడానికి ఇదే తగిన సమయమని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పెడూ యూసీసీపై చట్టం తేలేమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాద్ నఖ్వి స్పష్టం చేశారు. ఏడు దశాబ్దాలుగా స్వప్రయోజనాలను ఆశించే మతతత్వ కుట్రదారుల కంబంధ హస్తాల్లో చిక్కుకున్న ఉమ్మడి పౌర స్మృతికి విముక్తి కల్పించాలనే వాతావరణం దేశంలో నెలకొందని ఆయన చెప్పారు.

”అందరినీ కలుపుకొని వెళ్లే సంస్కరణ అమలుకు ఇదే సరైన సమయం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదు” అని శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ నఖ్వి చెప్పారు. యూసీసీతో అందరికీ సమానత్వం, సమన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఏడుదశాబ్దాలు కేవలం తమ స్వప్రయోజనాల కోసం మతతత్వ కుట్రదారుల చేతిల్లో బందీగా చిక్కుకున్న  ఉమ్మడి పౌర స్మృతికి విముక్తి కల్పించాలని యావద్దేశం ఆసక్తితో ఉందని మాజీ కేంద్ర మంత్రి చెప్పారు.

ఉమ్మడి పౌర స్మృతి పై కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలపై నఖ్వి విమర్శలు గుప్పించారు. మతతత్వ రాజకీయాలను పక్కనపెట్టి అంతరాత్మ ప్రభోధం మేరకు నడుచుకోవాలని ఆ పార్టీలకు ఆయన హితవు పలికారు. ఉమ్మడి పౌర స్మృతి వంటి ప్రగతిశీలక చట్టం వల్లం అందరికీ సమానత్వం, సమన్యాయం సాధ్యమవుతుందని తెలిపారు.

1985లో కాంగ్రెస్ చేసిన పొరపాటుతో దేశం దశాబ్దాలపాటు శిక్ష అనుభవించిందని, షాబానో కేసులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో సంఖ్యాబలం ఆధారంగా సమ్మిళిత సంస్కరణపై మతపరమైన దాడి చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అందుకు దేశం శిక్ష అనుభవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఒకే కుటుంబంలో రెండు చట్టాలు సరికాదని, అలాగే దేశంలో కూడా రెండు చట్టాలు సరికాదని, అందరికీ ఒకే చట్టం ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఉమ్మడి పౌర స్మృతిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బీజేపీ ఎన్నికల వాగ్దానాల్లో కూడా చాలాకాలంగా యూసీసీ కీలకంగా ఉంది.

370వ అధికరణ రద్దు చేస్తామనే ఎన్నికల హామీని బీజేపీ కొద్దికాలం క్రితమే నిలబెట్టుకోగా, అయోధ్యలో రామమందిర నిర్మాణం కార్యరూపంలోకి వచ్చింది. 2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉమ్మడి పౌర స్మృతికి ఈసారి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే పట్టుదలతో బీజేపీ ఉంది.