పరీక్షల పేరుతో మంగళ సూత్రాలు తొలగిస్తే ఊరుకునేది లేదు

గ్రూప్ 4 పరీక్ష సందర్భంగా హిందువులను అవమానిస్తే, చూస్తూ ఊరుకునేది లేదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. హిందువుల సంప్రదాయాలను మంటగలిపే దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని స్పష్టం చేసింది. గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని కలిసిన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం వినతి పత్రం సమర్పించింది.

పరీక్ష హాల్ లోకి అనుమతించే క్రమంలో ఇతర మతస్తులను కనీసం టచ్ కూడా చేయని  అధికారులు హిందువుల విషయంలో  ఘోరాతి ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవి రింగులు, గాజులు, ముక్కుపుడకలతో పాటు తాళిబొట్టు, కాలి మెట్టెలు కూడా తొలగించి పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్న విషయం మనం చాలా సందర్భాల్లో చూస్తున్నామని తెలిపారు.

హిందువుల విషయంలో ఇంతటి వివక్ష ప్రదర్శిస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఇటీవల భాగ్యనగరంలోని సైదాబాద్ లో గల ఓ డిగ్రీ కళాశాల పరీక్ష హాల్లో ముస్లిం అమ్మాయిలకు హిజాబ్ తీసివేయాలని కళాశాల యాజమాన్యం సూచించడంతో, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ స్పందించి కళాశాల వారిని భయభ్రాంతులకు గురి చేసిన విషయం గుర్తు చేశారు.

కాగా,  ఏ పరీక్ష కేంద్రంలోనైనా హిందువుల మనోభావాలు గాయపరుస్తూ తాళిబొట్టు, కాలి మెట్టెలు, చేతి గాజులు తొలగించాలని ఒత్తిడి తెస్తే విశ్వహిందూ పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు కోరారు. తప్పుగా వ్యవహరించిన  వారిపై చట్టపరంగా చర్యల కోసం పోరాడుతూ సస్పెండ్ చేసేదాకా వదలమని స్పష్టం చేశారు.

ముఖ్యంగా పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలని, తాళిబొట్టు తీయమనగానే తీసి వారి చేతిలో ఇవ్వడం సరికాదని, ప్రతిఘటించి ఎదురు దాడి  చేయాలని వారు సూచించారు. అత్యుత్సాహం ప్రదర్శించే అధికారుల విషయంలో తాము సీరియస్ గా వ్యవహరించి, సస్పెండ్ చేసేదాకా పోరాడుతామని హెచ్చరించారు.

 టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీని కలిసిన వారిలో  పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు ఉన్నారు.