కరోనా వైరస్ చైనా ప్రయోగించిన జీవాయుధమే!

ప్రపంచానికి ప్రాణాంతకంగా మారిన కరోనా వ్యాప్తి వెనుక చైనా కుట్ర దాగి ఉన్నట్టు, ఈ వైరస్‌ను జీవాయుధం వలే వాడుకొనేలా చైనా ఉద్దేశపూర్వకంగా మార్పులు చేసినట్టు వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ పరిశోధకుడు చావోషావ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ ఝెంగ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆయన ఈ వివరాలు వెల్లడించడం సంచలనం కలిగిస్తున్నాయి.

ఈ ల్యాబ్‌లో ఉన్నతాధికారి ఒకరు మొత్తం నాలుగు రకాల వైరస్‌లను తమ సహచరులకు ఇచ్చి ఏది వేగంగా ఎక్కువ జాతులకు వ్యాపిస్తుందో గుర్తించమని ఆదేశించారని, దీంతోపాటు సులువుగా దీనిని వేరే వ్యక్తులు, జాతులకు సోకేలా చేసేందుకు ఉన్న మార్గాలను కనుగొనమని ఆదేశించినట్టు వెల్లడించారు. కరోనా వైరస్‌ను చావో ఓ జీవాయుధంతో పోల్చారు.

2019 లో వుహాన్‌లో ప్రపంచ స్థాయి సైనిక క్రీడలు జరిగిన సమయంలో తమ సహచరులు చాలా మంది అదృశ్యమయ్యారని, వారందరినీ సైనిక క్రీడాకారులు బస చేసిన హోటళ్లలో పరిశుభ్రతను పరిశీలించేందుకు పంపినట్లు తెలిసిందని తెలిపారు. వాస్తవానికి పరిశుభ్రతను గుర్తించేందుకు వైరాలజిస్టుల అవసరం లేదని, ఆ క్రీడాకారులున్న చోట వైరస్‌ను వ్యాప్తి చేసేందుకే వారిని పంపినట్టు తెలిసిందని సంచలన ఆరోపణలు చేశారు.

గతంలో తనను కూడా షింజియాంగ్‌లో ప్రభుత్వ ఖైదీలుగా ఉన్న వీగర్ల ఆరోగ్యం గురించి తెలుసుకొనేందుకు పంపారని 2020లో చావో ఆరోపించారు. ఈ మొత్తం కుట్రలో తాను చెప్పేది చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.