సర్వే సంస్థలకు అందని రీతిలో తెలంగాణ ప్రజల తీర్పు ఉండబోతోందని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. బీజేపీ నేతలతో ఫొటో దిగితేనే బీసీ బంధు, దళిత బంధు, ప్రభుత్వ పథకాలు అందవని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ సంక్షేమ పథకాలు రావనే భయంతో బయటకు చెప్పకపోవచ్చని తెలిపారు.
అయితే, మరోసారి కేసీఆర్ గెలిస్తే మన బతుకులు ఆగమేనని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అంటూ, స్వేచ్ఛ ఉంటే తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే సచివాలయంలోకి ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ఇంకా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉందని చెబుతూ తెలంగాణలో ప్రత్యేక వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోందని, తప్పకుండా తెలంగాణ బీజేపీ విజయం సాధిస్తుందని ఈటెల భరోసా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను కొట్టేది బీజేపీనే అని భరోసా వ్యక్తం చేశారు. ఈసారి కేసీఆర్కు ఓటు వేయవద్దని రైతులంతా భావిస్తున్నారని చెబుతూ తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ ఓటమి తప్పదని మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ మోడల్ దేశానికి అందిస్తానన్న కేసీఆర్ ఇక్కడి ప్రజలకు ఏమిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిందని, పార్టీని వాడవాడలా తీసుకెళుతున్నామని పేర్కొన్నారు. ప్రగతిభవన్లో కేసీఆర్ వేసిన స్కెచ్ వల్లే హుజురాబాద్ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నాని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్ ముదిరాజ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, తనను జాగ్రత్తగా ఉండాలని కొన్ని నెలలుగా బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ చెప్పారు. అయితే, గ్యాంగ్స్టర్ నయీమ్కే తాను భయపడలేదని చెబుతూ ఈ బెదిరింపులకు భయపడతానా? అని ప్రశ్నించారు.
More Stories
విద్యా భారతి విజ్ఞాన కేంద్రంకు డా. భగవత్ తో ప్రారంభోత్సవం
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల