పిండ మార్పిడి పద్దతిలో దేశంలోని తొలి దూడ

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కి చెందిన గో సంరక్షణ శాలలో దేశంలోనే తొలిసారిగా పిండ మార్పిడి (సరోగసి) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించిందని టిటిడి ఈవో ధర్మారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశావాళీ గో జాతులను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఎంఓయు కుదుర్చుకున్నాయి.

ఇందులో భాగంగా మేలు రకమైన దేశవాళీ గో జాతిని అభివృద్ధి చేసే క్రమంలో ఎస్వీ గో సంరక్షణ శాలలోని మేలు జాతి ఆవుల నుండి అండం సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవిఎఫ్ ల్యాబ్ లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారు. ఈ విధానం కింద టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు ఈవో తెలిపారు. ఈ ప్రక్రియలో శనివారం రాత్రి ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు ధర్మా రెడ్డి తెలిపారు.

ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ, ‘‘పిండమార్పిడి చేసిన ఆవులలో ఇప్పటివరకు 11 ఆవులు గర్భం దాల్చాయి. ఒక ఆవు శనివారం రాత్రి సాహివాల్‌ పెయ్య దూడకు జన్మనిచ్చింది. రానున్న రోజుల్లో మరో 10 సాహివాల్‌ దూడలు పురుడుపోసుకోనున్నాయి. ఈ పద్ధతిలో రానున్న ఐదేళ్లలో 324 మేలు రకమైన సాహివాల్‌ గోజాతి దూడలను ఉత్పత్తి చేస్తాం’’ అని వివరించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ధూప దీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని దేశవాళీ ఆవుపాల నుండి ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చారని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.  రానున్న రోజుల్లో ఇంకా 10 సాహివాల్ దూడలు జన్మించనున్నాయని తెలియజేశారు.

ఆవుల ఆరోగ్య పరంగా, అధిక పాల దిగుబడి దిశగా నాణ్యత కలిగిన దాణా తయారీ చేసుకోవడానికి ఇటీవలే గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప్రారంభించినట్లు చెప్పారు. అదేవిధంగా గోశాలలో రోజుకు సుమారు 3 వేల నుండి 4 వేల లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఈవో తెలిపారు. రోజుకు 60 కేజీ ల స్వచ్ఛమైన నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి స్వామి వారి నిత్య కైంకర్యం, నైవేద్యాలకు వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.