విద్యుత్తు బిల్లుల భారం నుంచి ఉపశమనం

దేశంలో పలు రాస్త్రాలలో ఒక వంక విద్యుత్ కోతలు ప్రజలను ఇబ్బంది పెడుతుండగా, నష్టాలతో నడుస్తున్న డిస్కోమ్ ల కారణంగా విద్యుత్ చార్జీలు సహితం తలకు మించిన భారంగా మారుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ నిబంధనలు 2020లో సవరణల కారణంగా విద్యుత్ బిల్లుల నుండి వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.
 
టైమ్ ఆఫ్ డే (టిఓడి)టారిఫ్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిసిటీ టారిఫ్ సిస్టమ్‌లోని మార్పులు అమలులోకి రానున్నాయి. టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ అనేది గరిష్ట విద్యుత్ డిమాండ్ 10 కిలోవాట్లు, అంత కన్నా ఎక్కువగా ఉండే కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియగదారులకు ఏప్రిల్ 1, 2024 నుంచి అమలులోకి వస్తుంది.
 
అలాగే వ్యవసాయ వినియోగదారులు మినహా మిగిలిన వినియోగదారులకు ఏప్రిల్ 1, 2025 నుంచి అమలు అవుతుంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ కొత్త విధానంలో ఉదయం సమయాల్లో వినియోగించే విద్యుత్‌ ఛార్జీల భారం 20 శాతం తగ్గనుంది.
 
విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉండే రాత్రివేళల్లో విద్యుత్‌ ఛార్జీలు సాధారణం కంటే 10 నుంచి 20 శాతం వరకు పెరుగుతాయని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. డిమాండ్‌ తక్కువగా ఉన్న సమయంలో వినియోగదారులు ఎక్కువ విద్యుత్‌ను వాడుకునేలా ప్రోత్సహించడం ద్వారా గ్రిడ్‌లపై భారం తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది.
 
ఉదయం వేళ సోలార్‌ పవర్‌ అందుబాటులో ఉన్నందున ధర తక్కువగా ఉంటుందని, అందుకే ఉదయం సోలార్‌ విద్యుత్‌ అవర్స్‌గా పేర్కొంది. అందుకే ఈ సమయాల్లో వినియోగించే విద్యుత్‌కు ఛార్జీలు తక్కువ చేసినట్లు తెలిపింది. రాత్రి సమయాల్లో జల, థర్మల్‌ విద్యుత్‌, బయోమాస్‌ విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది.
 
ఈ ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రాత్రి సమయాల్లో వినియోగించే విద్యుత్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ తెలిపింది. దీని వల్ల తమ విద్యుత్‌ అవసరాలను సోలార్‌ అవర్స్‌కు మార్చుకునే వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఆర్‌కే సింగ్‌ చెప్పారు.
 
టీఓడీ నియమాలను కచ్చితంగా పాటించే వారికి ప్రయోజనాలు ఉంటాయని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తెలిపింది. టీఓడీ అనేది వినియోగదారుల విద్యుత్ బిల్లుల మొత్తాన్ని తగ్గించుకునేందుకు వీలు కల్పిస్తుందని, విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థలు వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుందని తెలిపింది.
 
వాతావరణంలో జరుగుతున్న మార్పుల మూలంగా ఈ సంవత్సరం వేసవిలో అధిక ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయి. దీనింతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. రానున్న 4 సంవత్సరాలల్లో విని యోగం రెట్టింపు అవుతుందని కేంద్రం అంచనా వేసింది.
 
దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి డిమాండ్‌ నాలుగు శాతం ఉండగా, మార్చి 2027 నాటికి ఇది 7.2 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త విద్యుత్‌ ఛార్జీల టారీఫ్‌ను అమలు చేయడం ద్వారా గ్రిడ్‌లపై భారాన్ని తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. విద్యుత్‌ టారీఫ్‌లతో పాటు స్మార్ట్‌ మీటర్ల నిబంధనల్లోనూ మార్పులు చేసినట్లు విద్యుత్‌ శాఖ తెలిపింది. స్మార్ట్‌ మీటర్‌ బిగించిన తేదీకి ముందు వరకు వినియోగించిన విద్యుత్‌పై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని తెలిపింది. స్మార్ట్‌ మీటర్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.