రూ 1.7 లక్షల కోట్ల బియ్యం, గోధుమల సేకరణ

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 55.8 మిలియన్ టన్నుల బియ్యాన్ని, 26.2 మిలియన్ టన్నుల గోధుమలను ప్రస్తుత మార్కెట్ సీజన్‌లో సేకరించింది. ఆహార మంత్రిత్వ శాఖ ఈ వివరాలను గణాంకాలతో వెల్లడించింది. బియ్యం సేకరణ క్రమంలో దేశంలోని 1.22 కోట్ల మంది రైతులకు ప్రయోజనం దక్కిందని, వీరికి రూ 1.7 లక్షల కోట్ల మేరకు కనీస మద్ధతుధరలు లభించాయని వివరించారు.

గోధుమల సేకరణలు 26.2 మిలియన్ టన్నుల స్థాయికి చేరాయి. గత ఏడాది రబీ పంటకాలపు మొత్తం సేకరణ కోటా 18.8 మిలియన్ టన్నులుగా నిలిచింది. ప్రస్తుత బియ్యం , గోధుమల నిల్వల పరిస్థితి దేశంలో ఇప్పుడు 57 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఈ దశతో దేశంలో ఆహార ధాన్యాల అవసరాలు సరైన విధంగా తీర్చేందుకు అనువైన సంతృప్తికరమైన వాతావరణం ఉందని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

సాధారణంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) రాష్ట్రాలలోని సంస్థలతో కలిసి ముందుగా రైతుల నుంచి వరిధాన్యం సేకరిస్తాయి. ఇదే విధంగా గోధుమ ధాన్యం కూడా తీసుకుంటారు. ఇదంతా కూడా రైతులకు ముందుగా ఖరారు అయిన ధరల మద్దతు పథకం పరిధిలో వీటిని సేకరించడం జరుగుతుంది.

ఈ క్రమంలో ఈ నెల 19 నాటికి ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ అయిన అక్టోబర్ సెప్టెంబర్ నాటికే 83 మిలియన్ టన్నుల మేర వడ్లను సేకరించారు. తరువాత వీటిని మరపట్టిన క్రమంలో 55.8 మిలియన్ టన్నుల మేర బియ్యం సేకరణ జరిగింది. ఇందులో కేంద్రం కోటా కింద దాదాపు 40.1 మిలియన్ టన్నుల మేర బియ్యం కేంద్రం కోటా కింద సేకరించడం జరుగుతుంది. ఇదే విధంగా ఎప్పటికప్పుడు గోధుమ పంట సేకరణ కూడా జరుగుతోంది. రైతుల నుంచి సేకరించుకుంటున్న వడ్లకు సరైన విధంగా బియ్యం పంపిణీ జరుగుతోందని అధికారులు తెలిపారు.