భారత్లో పెట్టుబడులకు టెస్లా సానుకూలం

అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్విట్టర్ సీఈవో, టెస్లా, స్పెస్ కంపెనీల అధినేత ఎలోన్ మస్క్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు,  వచ్చే ఏడాది తాను భారత్‌లో పర్యటిస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నాయకత్వాన్ని మెచ్చుకున్నారు మస్క్. ఇక తాను “మోదీ అభిమాని” అని కూడా చెప్పుకున్నారు.

భారతదేశం భవిష్యత్తు గురించి తాను చాలా ఎక్సైటింగ్గా ఉన్నానని, ప్రపంచంలోని ఏ దేశాని లేని విధంగా అభివృద్ధి చెందడానికి భారత్కు మాత్రమే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్టు న్యూయార్క్ ప్యాలెస్ హోటల్‌లో ప్రధాని మోదీతో మస్క్ పేర్కొన్నారు. టెస్లా సీఈఓ పిఎం మోదీతో తన సమావేశాన్ని వివరిస్తూ.. తమ భేటీ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పారు.

కాగా, ఎలోన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం అయిన టెస్లా త్వరలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని గతంలో కోరినట్లు కూడా ఈ సందర్భంగా ఎలోన్ మస్క్ చెప్పినట్టు సమాచారం.

ఈ సమావేశం గురించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అనేక విషయాలపై తాను ఎలోన్మస్క్తో మాట్లాడానని చెప్పారు. “ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా బాగుంది @elonmusk! శక్తి నుండి ఆధ్యాత్మికత వరకు ఉన్న సమస్యలపై మేము బహుముఖ సంభాషణలు చేసాము” అని ప్రధాని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రాశారు.

కాగా, ప్రధాని మోదీ, ఎలోన్ మస్క్ కీలక భేటీలో ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నలపై ఎలోన్ మస్క్ మాట్లాడుతూ.. “ఆయన (ప్రధానమంత్రి మోదీ) భారతదేశం గురించి నిజంగా శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే ఆయన భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది మేము చేయాలనుకుంటున్నాము. ఇప్పుడే ఆలోచిస్తున్నాము. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు.

ఇక.. స్పేస్‌ఎక్స్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన స్టార్‌లింక్‌ను భారత్‌కు తీసుకురావాలని యోచిస్తున్నట్లు కూడా ఎలోన్ మస్క్ చెప్పారు. ఇంటర్నెట్ యాక్సెస్ లేని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇది సహాయపడుతుందని మస్క్ చెప్పారు.  ప్రధాని మోదీ న్యూయార్క్‌లో అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డి గ్రాస్ టైసన్, ప్రొఫెసర్ నాసిమ్ నికోలస్ తలేబ్, రచయిత రాబర్ట్ థుర్మాన్, పెట్టుబడిదారు రే డాలియోలను కూడా కలిశారు.