నకిలీ మందులపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని, జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హెచ్చరించారు. భారత్లో తయారైన అనేక దగ్గు సిరప్ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో 71 కంపెనీలకు నకిలీ మందుల తయారీకి సంబంధించి షోకాజ్ నోటీస్లు జారీ చేసినట్టు , ఇందులో 18 కంపెనీలను మూసివేయాలని ఆదేశించినట్టు చెప్పారు. దేశంలో నాణ్యమైన ఔషధాల ఉత్పత్తిని నిర్ధారించడానికి కాంప్రహెన్సివ్ రిస్క్ బేస్డ్ విశ్లేషణ నిరంతరం జరుగుతుందని వివరించారు. నకిలీ మందుల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్న లక్షంతో ప్రభుత్వం, నియంత్రణ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారని పేర్కొన్నారు.
ప్రపంచానికి నాణ్యమైన ఫార్మాసిటీ భారత్ అయినందున ప్రతివారికి తాము ఈ విషయంలో భద్రత కల్పించాల్సి ఉందని తెలిపారు. ఫిబ్రవరిలో తమిళనాడు లోని గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తాము సరఫరా చేసే కంటిచుక్కల మందు మొత్తం వెనక్కు రప్పించుకుంది. అంతకు ముందు గత ఏడాది గాంబియాలో 66 మంది చిన్నారులు, ఉజ్బెకిస్థాన్లో 18 మంది చిన్నారులు మరణించడానికి భారత్లో తయారైన దగ్గు సిరప్ కారణమని ఆరోపణలు వచ్చాయి.
2021-22 లో భారత్ 17 బిలియన్ డాలర్ల విలువైన , 2022-23లో 17.6 బిలియన్ డాలర్ల విలువైన దగ్గు సిరప్ మందులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా జనరిక్ ఔషధాల సరఫరా దారైన భారత్ ప్రపంచ డిమాండ్లో 50 శాతం పైగా టీకాలను సరఫరా చేస్తోంది. భారతీయ తయారీ మందులపై ప్రశ్నలు తలెత్తడంతో వాస్తవాలు తెలుసుకోడానికి ప్రయత్నించామని, గాంబియాలో పిల్లల మృతికి భారత్కు చెందిన ఓ కంపెనీ దగ్గు మందు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో తెలిపిందని పేర్కొన్నారు.
దీనిపై వాస్తవాల కోసం లేఖ రాయగా, దానికి బదులు రాలేదని తెలిపారు. ఆ కంపెనీకి చెందిన శాంపిల్స్ పరిశీలించామని, మృతికి కారణాలు తెలుసుకోడానికి ప్రయత్నించగా, చిన్నారికి డయేరియా సోకినట్టు గుర్తించామని చెప్పారు. డయేరియా ఉన్న పిల్లలకు దగ్గుమందు సిరప్ ఎవరు సిఫారసు చేశారు? అని ప్రశ్నించారు. 24 శాంపిల్స్ తీసుకోగా, అందులో నాలుగు ఫెయిలయ్యాయని మంత్రి తెలిపారు.
జూన్ 1 నుంచి దగ్గు సిరప్లకు పరీక్షలు తప్పనిసరి విధానాన్ని అమలు చేస్తున్నారు. దగ్గుసిరప్ ఎగుమతి దారులు వాటిని ఎగుమతి చేసే ముందు ప్రభుత్వ లేబొరేటరీ పరీక్ష చేసినట్టు సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది.
కాగా, భారతదేశంలో తయారు చేయబడిన ఏడు దగ్గు మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఓ నివేదిక ప్రకారం అనేక దేశాలలో దగ్గు సిరప్ కారణంగా 300 మందికి పైగా మరణాలు సంభవించాయి. ఆ తర్వాత ఆరోగ్య సంస్థ ఈ చర్యకు పూనుకుంది. ఈ వ్యక్తులు దగ్గు సిరప్ తాగడం వల్లే చనిపోయారని డబ్లూహెచ్ఓ అభిప్రాయపడింది.
గత కొన్ని నెలల్లో నైజీరియా, గాంబియా, ఉజ్బెకిస్థాన్లలో దగ్గు సిరప్ తాగడం వల్ల అనేక మరణాలు నమోదయ్యాయి. డబ్లూహెచ్ఓ ప్రతినిధి ప్రకారం భారతదేశం, ఇండోనేషియాలోని ఫార్మా కంపెనీలు తయారు చేసిన 20 కంటే ఎక్కువ దగ్గు సిరప్లను పరీక్షించారు. విచారణ తర్వాత డబ్లూహెచ్ఓ భారతదేశంలో తయారు చేయబడిన ఈ దగ్గు సిరప్ గురించి హెచ్చరికను కూడా జారీ చేసింది. గాంబియా, ఉజ్బెకిస్థాన్ మరణాల తర్వాత వివాదంలోకి వచ్చినవి ఈ దగ్గు సిరప్లు. దగ్గు సిరప్ తాగడం వల్ల 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
More Stories
ముగిసిన ఇదో విడత ప్రచారం … రేపే పోలింగ్
ఆరు నెలల్లో భారత్ లో భాగం కానున్న ఆక్రమిత కాశ్మీర్
కేంద్రంలో పదేళ్లుగా దమ్మున్న ప్రభుత్వం