మోదీ అమెరికా పర్యటనలో రక్షణ పరిశ్రమలు కీలకం

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధికారిక పర్యటన క్రమంలో ఇరు దేశాల మధ్య మరింత రక్షణ సంబంధాలపై దృష్టి సారిస్తారు. ఇదే ఈ పర్యటన ప్రధాన అజెండా అని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా సోమవారం విలేకరుల గోష్టిలో తెలిపారు. ప్రధానంగా రక్షణ భద్రత విషయాలపై అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌తో చర్చలు ఉంటాయి.

పరిశ్రమల స్థాపనల దిశలో రోడ్‌మ్యాప్ ఖరారు కీలక విషయం కానుంది. వివిధ రంగాల్లో సహ ఉత్పత్తి, కలిసికట్టు అభివృద్ధి, సరఫరాల నిర్వహణ వంటివాటిపై విధివిధానాల రూపకల్పన ఉంటుందని క్వాత్రా తెలిపారు. వాణిజ్యం పెట్టుబడుల సత్సంబంధాలపై బైడెన్‌తో విశ్లేషణాత్మక చర్చలు ఉంటాయి.

ఇప్పటికే అమెరికాలో ఐటి , సాంకేతిక రంగంలో భారతీయత విస్తరించుకుని ఉన్న దశలో టెక్నాలజీ పరిధిలోకి వచ్చే టెలికం, అంతరిక్షం, ఉత్పత్తి రంగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ సంబంధిత పారిశ్రామిక రంగంలో ఇప్పుడు పలు అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో అమెరికా, భారత్ పరస్పర సహకారం దిశలో ప్రధాని చర్చలు ఉంటాయని కార్యదర్శి తెలిపారు.

 భారత్, అమెరికా రక్షణ భాగస్వామ్యం అత్యంత కీలక విషయం అని, ఈ పరిధిని మరింత విస్తృత పరచుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ దిశలోనే విస్తృత స్థాయిలో భారత్ – అమెరికా ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు అనేకం జరిగాయని, ఇవన్నీ కూడా ద్వైపాక్షికమే కాకుండా ప్రాంతీయ స్థాయిలో కూడా ప్రయోజనకరమైనవని ఆయన తెలిపారు.

అమెరికాలో పర్యటన తర్వాత ప్రధాని మోదీ ఈ నెల 24 , 25 తేదీలలో ఈజిప్టులో ఆ దేశ అధ్యక్షులు అబ్దెల్ ఫతా ఎల్ సిసి ఆహ్వానం మేరకు పర్యటిస్తున్నారని వినయ్ వివరించారు. బోహ్రా మతస్తులు ఇటీవలే పునరుద్ధరించిన ప్రఖ్యాతమైన 11వ శతాబ్దపు అల్ హకీం మసీదును ప్రధాని ఈ సందర్భంగా సందర్శిస్తారు.