చెన్నైని ముంచెత్తిన వాన.. విమాన రాకపోకలు అంతరాయం

తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టుతోపాటు రాజధాని పరిసరాల్లోనీ తీర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది.
 
చైన్నైలోని మీనంబాక్కంలో గడిచిన 24 గంటల్లో 137.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు భారీగా నిలిచిపోయింది. వాహనాలు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం వరకు ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
 
 ఈ నేపథ్యంలో చెన్నైతోపాటు చుట్టుపక్కల ఆరు జిల్లాల్లో ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. కాగా, భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. చెన్నై నుంచి బయల్దేరాల్సిన 12కుపైగా అంతర్జాతీయ విమనాలకు ఆలస్యమయింది. చెన్నపట్నానికి రావాల్సిన ఆరు విమానాలను బెంగళూరుకు దారిమళ్లించారు.
 
అయితే ఈ నెల 21 వరకు చెన్నై, దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి చెన్నై అంతటా విస్తారంగా భారీ వర్షాలు నమోదయ్యాయి.