రూ. 242 కోట్ల మార్గదర్శి ఆస్తుల జప్తు

మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీరావుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే రూ. 793.50 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఏపీ ప్రభుత్వం  తాజాగా మరో రూ.  242 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేశారు.
 
ఆస్తులను అటాచ్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. ఈ మేరకు జీఓ నంబర్ 116ను జారీ చేసింది. ఈ జీఓను హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శిలో డబ్బులను డిపాజిట్ చేసిన చందాదారుల నిధుల మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు.
 
40 సంస్థలకు వాటిని మళ్లించినట్లు గుర్తించారు. ఈ 40 సంస్థల పేర్లను ఈ జీఓలో పొందుపరిచారు. డీమార్ట్‌ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్ మార్కెట్స్, భారతి ఎయిర్‌టెల్, సెంచరీ టెక్స్‌టైల్స్ వంటి సంస్థలకు నిధులను మళ్లించినట్లు గుర్తించారు. ఛిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది మార్గదర్శి చిట్స్ సంస్థ యాజమాన్యం.
 
అవి నిజమని తేలడంతో సీఐడీ అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఛిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు. తాజాగా రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేశారు.
 
మార్గదర్శి ఛిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు సోదాలను నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగాయి. మార్గదర్శి కార్యాలయాల్లో రోజంతా తనిఖీలను కొనసాగించారు. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీరావును కూడా వారు విచారించారు. ఫిల్మ్‌సిటీలోని రామోజీ రావు నివాసంలో ఈ విచారణ కొనసాగింది.