40 శాతం కమీషన్లు ఆరోపణలపై బిజెపి పరువు నష్టం దావా

కర్ణాటకలో ఇదివరకటి బిజెపి ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్లు పుచ్చుకుందని ఆరోపిస్తూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సాగించిన ప్రచారంపై కాంగ్రెస్ అగ్రనేతలను ప్రస్తావిస్తూ బిజెపి కోర్టులో పరువు నష్టం దావా వేసింది.  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీపై బిజెపి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట పరువు నష్టం దావా దాఖలు చేసింది. ఈ కేసు జూలై 27న విచారణకు రానుంది

మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసులను విచారించడానికి ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ప్రతివాదులకు మంగళవారం నోటీసులు జారీ చేసింది.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తప్పుడు ఆరోపణలతో బిజెపి ప్రతిష్టను దెబ్బతీస్తూ కాంగ్రెస్ పారీ అన్ని ప్రధాన దినపత్రికలలో ప్రకటనలను ప్రచురించినట్టు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కేశవ ప్రసాద్ మే 9న తన ప్రైవేట్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అప్పటి బిజెపి ప్రభుత్వం 40 శాతం కమీషన్లతో అవినీతికి పాల్పడి నాలుగేళ్లలో రూ. 1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినట్లు కెపిసిసి అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే 5న అన్ని ప్రధాన వార్తాపత్రికలలో ప్రకటనలు గుప్పించిందని ఆయన ఆరోపించారు.  ఇవి నిరాధార, దురుద్దేశపూర్వక, పరువు నష్టంతో కూడిన ఆరోపణలుగా ఆయన పేర్కొన్నారు. అటువంటి ప్రచారం కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ “PayCM” ప్రచారాన్ని ముందుకు తెచ్చింది.. ఇది 40 శాతం లంచం ఆరోపణలను ట్రాక్ చేయడంలో సహాయపడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ నేతలు, మంత్రులపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే చేతులెత్తేసిందని తెలిపారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ బసవరాజ్ బొమ్మాయిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టారని ఆరోపించారు.