2జీ, 3జీ, 4జీ పార్టీలను తరిమికొట్టాలి

వారసత్వ రాజకీయాలను నడుపుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడే 2జీ, 3జీ, 4జీ పార్టీలను పార్టీలను తరిమికొట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపిచ్చారు. తమిళనాడులోని వేలూరులో ఆదివారం సాయంత్రం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌, డీఎంకే 2జీ, 3జీ, 4జీ పార్టీలని ఎద్దేవా చేశారు.

“కాంగ్రెస్, డీఎంకేలు 2జి,3జి,4జి పార్టీలు. నేను మాట్లాడుతున్నది 2జి స్పెక్ట్రం కేటాయింపు కుంభకోణం గురించి కాదు. 2జి అంటే రెండు జనరేషన్లు, 3జి అంటే మూడు జనరేషన్లు, 4జి అంటే నాలుగు జనరేషన్లు” అని అమిత్‌షా వివరించారు.

2జీ అంటే 2జీ స్పెక్ట్రమ్‌ అవినీతి కాదని, రెండు తరాలని.. 3జీ అంటే మూడు తరాలని, 4జీ అంటే నాలుగు తరాలని పేర్కొంటూ తమిళనాట డీఎంకేకు చెందిన మారన్‌ కుటుంబీకులు రెండు తరాలపాటు అవినీతికి పాల్పడ్డారని, కరుణానిధి కుటుంబం మూడు తరాలుగా అవినీతికి పాల్పడుతోందని, కాంగ్రెస్‌కు చెందిన రాహుల్‌గాంధీ నాలుగో తరం కుటుంబీకుడని, నాలుగు తరాల పాటు దేశాన్ని దోచుకున్నారని విమర్శించారు.

ఈ అవినీతి పార్టీలకు గుణపాఠం చెప్పి తమిళనాట భూమిపుత్రుడికి పట్టం కట్టే రోజులు చేరువలోనే ఉన్నాయని అమిత్ షా స్పష్టం చేశారు. 2004 నుండి 2014 వరకు పదేళ్ల యూపీఏ ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్‌, డీఎంకే కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డాయని కేంద్ర మంత్రి ఆరోపించారు.

తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వం పదేళ్లుగా ఉందని, రూ.12,000 కోట్ల అవినీతి, కుంభకోణాలకు ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని, ప్రపంచదేశాల్లో భారతదేశ ప్రతిష్టను మోదీ ఇనుమడింపజేశారని, భారతదేశానికి భద్రతను పాదుకొలిపారని అమిత్‌షా వివరించారు.

18 ఏళ్లు కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్న డీఎంకే  రాష్టంలో ఎయిమ్స్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని అమిత్ షా ప్రశ్నించారు. తిరుక్కురళ్‌ను 13 భారతీయ భాషల్లో అనువదించి తమిళ భాషకు పట్టం గట్టింది కూడా మోదీయేనని ఆయన గుర్తు చేశారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో సెంగోల్‌ను ప్రతిష్ఠించి తమిళులందరినీ గర్వపడేలా చేసింది కూడా ఎన్డీఏ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

‘‘ఓ తమిళుడిని ప్రధానిని చేయాలన్నదే తన చిరకాల కోరిక’’ అని అమిత్ షా చెప్పారు. భవిష్యత్‌లో ఓ తమిళుడిని ప్రధానిగా గెలిపిద్దామని పిలుపిచ్చారు. తమిళనాడుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్‌, కాంగ్రెస్‌ మాజీనేత జీకే మూపనార్‌ ప్రధాని పదవిని చేపట్టేందుకు అవకాశాలు వచ్చినా.. డీఎంకే అడ్డుకుందని ఆయన  ఆరోపించారు.