రెపో రేటు 6.5 శాతం యథాతథం

ముందు నుంచి ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. వరుసగా రెండోసారి కీలక పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయడం లేదని తెలిపింది. గత మంగళవారం ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.
 
కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. దాంతో పాటు ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు సైతం 6.75 శాతం వద్ద స్థిరంగానే ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన క్రమంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అందులో భాగంగానే కీలక రేట్లలో చేయట్లేదని తెలిపారు.
 
 ‘సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలని ఎంపీసీ కమిటీ నిర్ణయించింది. ద్రవ్యోల్బణం తీరును నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఎంపీసీ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ నిర్ణయం గిరాకీ వృద్ధికి ఊతమిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది. ఖజానాలో 595.1 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ‘ అని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
 
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీసీ సమావేశంలో రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించింది రిజర్వ్ బ్యాంక్. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నెల నుంచి వరుసగా ఆరుసార్లు రెపో రేటును ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర పెంచి, ఏప్రిల్ నెలలో పెంపునకు బ్రేకులు వేసింది.
 
ఈ కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణాని గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠానికి 4.7 శాతానికి దిగివచ్చింది. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు బ్రేకులు వేసింది ఆర్‌బీఐ. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం పరిధి 4 శాతానికి ఎగువనే కొనసాగుతోందని గవర్నర్ చెప్పారు. ఈ ఏడాది సైతం అదే స్థాయిలో ఉండొచన్ని తెలిపారు.
 
అయితే, ఈ ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం అంచనాలను 5.2 శాతం నుంచి 5.1 శాతనికి తగ్గించినట్లు చెప్పారు. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంగా ద్రవ్యోల్బణం 4.6 శాతం, రెండో క్వార్టర్‌లో 5.2 శాతం, మూడో క్వార్టర్‌లో 5.4 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతం ఉండొచ్చని అంచనా వేసినట్లు చెప్పారు.
 
ఈ ఆర్థిక ఏడాదిలో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలకు అనుగుణంగా 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేసినట్లు తెలిపింది ఆర్‌బీఐ. తొలి త్రైమాసికంగా జీడీపీ వృద్ధి రేటు 8 శాతం, రెండో త్రైమాసికంలో 6.5 శాతం, మూడో క్వార్టర్‌లో 6 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.7 శాతం అంచనా వేసినట్లు వెల్లడించింది.