ప్రపంచం దృష్టిలో భారత్ నమ్మకమైన భాగస్వామి

అభివృద్ధిలో అత్యంత నమ్మకమైన, సమర్థవంతమైన భాగస్వామిగా భారత దేశాన్ని ప్రపంచం పరిగణిస్తోందని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను గురువారం విలేకర్ల సమావేశంలో జైశంకర్ వివరిస్తూ  ప్రపంచం, మరీ ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు, భారత దేశాన్ని అభివృద్ధిలో విశ్వసనీయతగల, సమర్థవంతమైన భాగస్వామిగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.
 
క్షేత్ర స్థాయిలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ ప్రపంచంలో అత్యధిక భాగం భారత దేశాన్ని అభివృద్ధి భాగస్వామిగా చూస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి భాగస్వామిగా మాత్రమే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన దానికి తగినట్లు నడచుకునే అభివృద్ధి భాగస్వామిగా చూస్తున్నట్లు చెప్పారు.
 
 భారత దేశం ఓ ఎకనమిక్ కొలాబరేటర్ అనే మరో కీర్తి నేడు భారత దేశానికి లభించిందని చెబుతూ మన దేశం సాధిస్తున్న ఆర్థిక ప్రగతిని ప్రపంచం గుర్తిస్తుందని పేర్కొన్నారు.చెప్పుకోదగ్గ మార్పులు జరుగుతున్న అనేక రంగాల్లో విదేశాంగ విధానం ఒకటి అనే విషయాన్ని అత్యధికులు వివాదాస్పదం చేయబోరని భావిస్తున్నానని చెప్పారు.
 
విదేశాంగ విధానంలో జరిగిన మార్పులు ఎక్కడ కనిపిస్తాయో వివరిస్తూ  మన దేశం సమున్నతంగా నిలబడటం, గొప్ప పలుకుబడిని చూపడం, పట్టు సాధించడం, నూతన భావనలు, పటిష్టమైన డెలివరీలలో ఈ మార్పులు కనిపిస్తాయని చెప్పారు. విదేశాంగ విధానం ఏ విధంగా మారిందో నిర్ణయించి, తీర్పు చెప్పడానికి ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయని తెలిపారు.
 
దీనివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? గాఢమైన ప్రభావాన్ని ఎక్కడ చూపించింది? వంటివాటిని నిర్ణయించడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో మొదటిది, ‘‘ప్రపంచం నేడు భారత దేశాన్ని ఏ విధంగా చూస్తోంది?’’ , రెండోది, సామాన్యుల జీవితాలను విదేశాంగ విధానం ఏ విధంగా ప్రభావితం చేసింది? అని చెప్పారు.
మన ఉమ్మడి అనుభవాల సారాన్ని ప్రజల ముందు ఉంచుతున్నట్లు తెలిపారు. నేటి ప్రపంచం, మరీ ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు భారత దేశాన్ని అభివృద్ధి భాగస్వామిగా, విశ్వసనీయమైన, సమర్థవంతమైన అభివృద్ధి భాగస్వామిగా ఎలా చూస్తున్నాయనేదాని నుంచి తాను ప్రారంభిస్తానని పేర్కొన్నారు. నమీబియా, గుయానా, మొజాంబిక్, కెన్యా, మారిషస్ దేశాల్లో భారత దేశ అభివృద్ధి భాగస్వామ్యం గురించి వివరించారు. గుయానాకు ఫెర్రీని ఇచ్చామని, మొజాంబిక్‌లో రైల్వేల అభివృద్ధిలో, కెన్యాకు టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ అభివృద్ధిలో, మారిషస్‌కు మెట్రో నిర్మాణంలో భాగస్వాములమయ్యామని చెప్పారు.
నమీబియాలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించామని, పరమ్ సూపర్‌కంప్యూటర్‌ను ఇచ్చామని చెప్పారు. వారితో కలిసి పని చేస్తున్నామని, వారికి సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. వారిలో ఎంటర్‌ప్రెన్యూవరియల్ స్కిల్స్‌ను పెంపొందిస్తున్నామన్నారు. పరిశోధనను కూడా ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు వీ మురళీధరన్, మీనాక్షి లేఖి, రాజ్ కుమార్ రంజన్ సింగ్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాట్రా కూడా పాల్గొన్నారు.