తొలితరం ఇంగ్లిష్‌ న్యూస్‌ యాంకర్‌ గీతాంజలి అయ్యర్ మృతి‌

దూరదర్శన్‌ తొలి ఇంగ్లీష్‌ యాంకర్‌ గీతాంజలి అయ్యర్‌ బుధవారం మృతి చెందారు. ఆమె వయస్సు 76 ఏళ్లు. కొంత కాలం నుంచి అమె గతకొంతకాలంగా పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. బుధవారం న్యూఢిల్లీలోని స్వగృహంలో కొంత అస్వస్థతకు గురికాగా, సహాయక సిబ్బంది ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
 
గీతాంజలి దూరదర్శన్‌లో 1971 నుంచి 30 ఏళ్ల పాటు యాంకర్‌గా పని చేశారు. దూరదర్శన్‌ స్వర్ణయుగ కాలంలో ఆమె ప్రముఖ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగుసార్లు ఉత్తమ యాంకర్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఇందిరాగాంధీ ప్రియదర్శని అవార్డును కూడా గెలుచుకున్నారు. గీతాంజలికు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఈ ఇద్దరూ వచ్చాక గీతాంజలి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె సన్నిహితురాలు సుమిత మెహతా తెలిపారు.
 
కోల్‌కతాలోని లొరెటో కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన గీతాంజలి దూరదర్శన్‌లో కెరీర్‌ ముగిశాక కార్పొరేట్‌ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీలో పని చేసిన ఆమె, ఖాందాన్‌ అనే సీరియల్‌లోనూనటించారు. ఆమె మృతిపట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌  సంతాపం తెలిపారు. దూరదర్శన్  ఆల్‌ ఇండియా రేడియోలో మొదటి ఇంగ్లిష్ న్యూస్‌ యాంకర్లలో ఆమె ఒకరని చెప్పారు. దూరదర్శన్‌కు ఆమె చేసిన సేవలను కొనియాడారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.