బీహార్ లో నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన కేబుల్‌ బ్రిడ్జి

బీహార్‌లో ఘోర ప్రమాదం తప్పింది. భాగల్‌పూర్‌లో గంగానదిపై నిర్మిస్తున్న నాలుగు దారుల  కేబుల్‌ బ్రిడ్జి  పేకమేడలా కుప్పకూలింది. భగల్పూరులో ఈ ఘటన ఆదివారం సాయంత్రం పూట జరిగింది.  అందరూ చూస్తుండగానే వంతెన కూలిపోతుండటంతో  బ్రిడ్జి కూలిన దృశ్యాలను స్థానికులు వీడియో తీయగా, అవి నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బ్రిడ్జిలోని 3 అడుగుల భాగం ఆ కిందనే ఉన్న గంగలో కుప్పకూలింది. ఈ ఘటనపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ విచారణకు ఆదేశించారు. ఈ బ్రిడ్జికు ప్రమాదం జరగడం ఇది రెండోసారి అని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంత భాగం దెబ్బతిన్నట్లు సమాచారం.

దీంతో వంతెన నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్‌లో రెండు జిల్లాలను కలుపుతూ గంగానదిపై కట్టిన వంతెన వరుసగా కూలిపోవడంపై నిర్మాణ పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ వంతెన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలతో పాటు స్థానికులు సైతం డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణ కాంట్రాక్టును హర్యానాకు చెందిన ఎస్పీ సింగ్లాకు అప్పగించారు. ఖగారియా అగువాని- సుల్తాన్‌గంజ్‌ మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మిస్తున్నారు.

దాదాపు రూ.1,710 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2014లో బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ శంకుస్థాపన చేశారు. 2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో నితీశ్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

కాగా, ఇలాంటి ఘటనలు బీహార్‌లో తరచూ జరుగుతున్నాయి. 2022లో బెగుసరాయ్‌లో బుర్హి గండక్‌ నదిపై నిర్మించిన వంతెనలో కొంత భాగం కూలిపోయింది. వంతెన రెండు, మూడు పిల్లర్లు కూలిపోయాయి. అంతకు కొన్ని రోజుల ముందు నలంద జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. ఈఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అలాగే కిషన్‌గంజ్‌, సహర్సా జిల్లాల్లోనూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు కూలిపోయాయి.