మూడు, నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు

సాధారణంగా ఏటా మే చివరి నుండి జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. కానీ, ఈ ఏడాది రుతుపవనాలు  మరో మూడు నుంచి నాలుగు రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) సోమవారం ప్రకటన చేసింది.  ముందుగా ఐఎండీ అంచనా ప్రకారం జూన్ 4 నాటికే కేరళ తీరానికి రుతుపవనాలు చేరుకోవాల్సి ఉంది. కానీ, తాజా అంచనాల ప్రకారం జూన్ 7 నాటికి కేరళను తాకనున్నాయి. అనంతరం కేరళ నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి.

‘‘దక్షిణ అరేబియా సముద్రంపై పశ్చిమ గాలులు పెరుగుతుండటం వల్ల పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.. పశ్చిమ గాలుల తీవ్రత నిన్నటి (ఆదివారం) నుంచి పెరిగింది. సముద్ర ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తుకు జూన్ 4న చేరాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపైనా మేఘాల వ్యాప్తి పెరుగుతోంది. ఈ అనుకూల పరిస్థితులతో రుతుపవనాలు వచ్చే మూడు నాలుగు రోజుల్లో మరింత పురోగమిస్తాయి’’ అని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
 
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ సాధారణ వర్షపాతానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ రుతుపవనాలపై ముందస్తు అంచనల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది నైరుతి రుతు పవనాలు మే 29 కేరళ తీరానికి తాకాయి. అంతకుముందు 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న చేరుకున్నాయి. దీని ప్రకారం అయితే ఈ సారి మాత్రం ఒక వారం ఆల‌స్యంగా ప్రవేశించ‌నున్నాయి.

ఇక, నైరుతి రుతుపవనాల సమయంలో వాయవ్య, పశ్చిమ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం నుంచి లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తూర్పు భారతం, ఈశాన్య, వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం ఉంటుంది. వర్షాకాలంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని, సీజన్ ద్వితీయార్థంలో ఈ ప్రభావం ఉండొచ్చని పేర్కొంది.