కంది, మినపపప్పుల నిలువలపై పరిమితులు

దేశంలో కంది, మినప పప్పుల నిలువలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రజలకు న్యాయమైన ధరలో కంది, మినపప్పులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము ఆ రెండు రకాల పప్పుల నిలువలపై పరిమితులు విధిస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ పరిమితులు ఈ ఏడాది అక్టోబర్‌ 31 వరకు అమల్లో ఉంటాయని కేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది. హోల్‌ సేలర్స్‌, రిటెయిలర్స్‌, బిగ్‌ చైన్‌ రిటెయిలర్స్‌, మిల్లర్లు, దిగుమతిదారులు అందరికీ ఈ పరిమతులు వర్తిస్తాయని పేర్కొంది. హోల్‌సేలర్స్ 200 మిలియన్‌ టన్నులకు మించి కంది, మినప పప్పు స్టాక్‌ ఉంచుకోకూడదని కేంద్రం తన ప్రకటనలో ఆదేశించింది.

ఇక రిటెయిలర్‌లు 5 మిలియన్‌ టన్నులకు మించి, బిగ్‌ చెయిన్‌ రిటెయిలర్‌లు ప్రతి రిటెయిలర్‌ దగ్గర 5 మిలియన్‌ టన్నులకు మించి కంది, మినపపప్పు నిలువలు ఉంచుకోకూడదని కేంద్రం ఆదేశాల్లో పేర్కొంది. ఇక మిల్లర్‌లు గత మూడు నెలల్లో వచ్చిన స్టాక్‌ లేదా ఆ మిల్లు వార్షిక కెపాసిటీలో 25 శాతం రెండింట్లో ఏది ఎక్కువైతే అంతకుమించి కంది, మినపపప్పులను నిల్వ ఉంచుకోవద్దని ఆదేశించింది. అదేవిధంగా దిగుమతిదారులు కస్టమ్స్‌ క్లియరెన్స్‌ వచ్చిన తేదీ నుంచి 30 రోజులకు మించిన స్టాక్‌ను నిలువ ఉంచుకోవద్దని స్పష్టం చేసింది.