వంట నూనెల ధరలు తగ్గించాలని కేంద్రం సూచన

వంట నూనెల ధరలు తగ్గించాలని వంట నూనెల పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గిన నేపథ్యంలో ఒక్కో లీటర్‌కు రూ.8నుంచి 12 వరకు తగ్గించాలని తెలిపింది. ఈ మేరకు నూనెల పరిశ్రమ వర్గాలతో జరిగిన సమావేశంలో నూనెల ధరలు తగ్గించాలని సూచించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా వెల్లడించారు.
 
అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిస్థితులతో పాటు ఇన్‌పుట్‌, రవాణా వ్యయాలు పెరగడంతో 2021-22 సంవత్సరంలో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే 2022 జూన్‌ నుంచి అంతర్జాతీయంగా ఈ నూనెల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వాటికి అనుగుణంగా దేశీయంగా కూడా వంట నూనెల ధరలు తగ్గాయి. అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గినంత వేగంగా దేశంలో ధరలు తగ్గడం లేదని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
 
కాబట్టి తక్షణమే ధరలు తగ్గించాలని పరిశ్రమ వర్గాలకు సూచించింది. లీటర్‌కు రూ.8 నుంచి 12 మేర తగ్గించాలని పేర్కొంది. దీంతో త్వరలోనే వంటనూనెల ధరలు తగ్గుతాయని ఆహార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ద్రవ్యోల్బణ భయాలు సైతం తగ్గుతాయని వెల్లడించింది. దీనిపై పరిశ్రమ వర్గాలు సైతం సానుకూలంగా స్పందించాయి. ఇదే సమావేశంలో ప్రైస్‌ డేటా కలెక్షన్‌, వంట నూనెల ప్యాకేజీ తదితర అంశాలను కూడా చర్చించారు.
 
వంటనూనె తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులపై గరిష్ఠ రిటైల్ ధరలను తగ్గించాలని ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ శుక్రవారం సూచించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుదలను ఉదహరిస్తూ లీటరుకు రూ.8 నుంచి రూ.12 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను కోరింది.
సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సహా ప్రధాన పరిశ్రమ సంస్థలతో జరిగిన సమావేశంలో ఖర్చు ప్రయోజనాలను తక్షణమే వినియోగదారులకు బదిలీ చేయాలని తెలిపింది.
 
ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్‌లతో నెల క్రితం జరిగిన సమావేశంలో ముఖ్యమైన బ్రాండ్స్ శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్, శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్ పైన లీటరుకు రూ.5 నుంచి రూ.15 తగ్గించే దిశగా సూచనలు చేసింది. ఆవనూనె, ఇతర వంట నూనెలపై కూడా తగ్గించాలని పేర్కొంది