రాహుల్ ని విదేశాల్లో జిన్నా ఆత్మ ఆవహిస్తుంది

భార‌త్ లో మైనారీలకు, ద‌ళితుల‌కు ఎటువంటి ర‌క్ష‌ణ లేకుండా పోతున్న‌ద‌ని అంటూ అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన శరీరంలోకి దేశ విభజనకు కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా ఆత్మ లేదా అల్-ఖైదా వంటి వ్యక్తుల ఆలోచన ప్రవేశిస్తుందని అంటూ  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మండిపడ్డారు. అతనిని భారతదేశానికి వచ్చి ఒక మంచి భూతవైద్యుని వద్ద భూతవైద్యం చేయించుకోమని సూచిస్తాను అంటూ ఎద్దేవా చేశారు.
 
రాహుల్ గాంధీ ఫ్యూడల్ సామ్రాజ్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమ్మిళిత అభివృద్ధి ద్వారా ధ్వంసం చేశారని, దీనిని  జీర్ణించుకోలేక పోవడమే రాహుల్ గాంధీకి ఉన్న ప్రధాన సమస్య అని ముక్తార్ విమర్శించారు. రాహుల్ గాంధీ  ఆయన ప్రజాస్వామ్యాన్ని వారసత్వ పాలనను ఒకే గాటన కడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశ పరువు తీయడానికి రాహుల్ గాంధీ కాంట్రాక్ట్ తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను చూయింగ్ గమ్ లాగా ఉపయోగించిందని మాజీ కేంద్ర మంత్రి దుయ్యబట్టారు.
 
కాగా, భారతదేశ ప్రతిష్టను ప్రపంచమంతా గుర్తిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగజార్చారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ‘‘ప్రధానమంత్రి మోదీ ఇటీవల తన విదేశీ పర్యటనలో దాదాపు 24 మంది ప్రధానులు, అధ్యక్షులను కలుసుకున్నారు. 50 కి పైగా సమావేశాలు నిర్వహించారు” అని గుర్తు చేశారు.
 
ప్రధాని మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని పలువురు ప్రపంచ నేతలు చెబుతున్నారుని పేర్కొంటూ ‘పీఎం మోదీ  బాస్‌’ అని ఆస్ట్రేలియా ప్రధాని అనడాన్ని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోయారని అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, 10 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కార్యకర్తలు, విద్యావేత్తలు, పౌర సమాజ సభ్యులతో సంభాషించారు. దేవుడి కన్నా తమకే ఎక్కువ తెలుసునని భావించే కొంతమంది భారత్‌లో ఉన్నారని, అందులో ప్రధాని మోదీ కూడా ఒకరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే విశ్వం ఎలా పనిచేస్తుందో దేవుడికే వివరిస్తారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని, ప్రజలను బెదిరిస్తోందని ఆరోపణలు చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి మరింత తీవ్రమైన సమస్యల నుంచి ప్రజలను మరల్చడానికి బీజేపీ బంగారు రాజదండం సెంగోల్‌ను ఉపయోగిస్తోందని విమర్శలు గుప్పించారు. రాజ‌రిక ప్ర‌జ‌స్వామ్యాన్ని మోదీ  అనుస‌రిస్తున్నారంటూ రాహుల్ మండిప‌డ్డారు.