టర్కీ అధ్యక్షుడిగా మూడోసారి ఎర్డోగాన్‌

టర్కీలో తనకు తిరుగులేదని తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి నిరూపించుకున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఆయన ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాలుగా టర్కీ పాలకుడిగా కొనసాగుతున్న ఎర్డోగాన్‌  తాజాగా జరిగిన ఎన్నికల్లో 52 శాతం ఓట్లు సాధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది.
 
ప్రత్యర్థి కెమల్‌కు 48 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొంది. దీంతో ఆయన విజయం ఖాయమైంది. ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉన్న టర్కీకి ఎర్డోగాన్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే మూడో దశాబ్దంలోకి ప్రవేశించినట్లువుతుంది. అయితే దేశంలో అధిక ద్రవ్యోల్బణం, భారీ భూకంపం తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించడం విశేషం.
 
ఫిబ్రవరి నెలలో వచ్చిన భూకంపం సమయంలో ఎర్డోగాన్‌ ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. కాగా, మరో ఐదేండ్లపాటు తనకు అధ్యక్ష పదవి అప్పగించినందుకు ఎర్డోగాన్ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఇస్తాంబుల్‌లోని ఇంటి వెలుపల తన మద్దతుదారులతో మాట్లాడారు.
 
నేడు టర్కీ విజయం సాధించిందని చెప్పారు. తాను 21 సంవత్సరాలుగా మీ నమ్మకానికి అర్హుడినని చెప్పారు. బైబై కెమల్‌.. ఎర్డోగాన్‌ నినాదాలతో ఆయన మద్దతుదారులు పెద్దపెట్టున నినాదాలు హోరెత్తించారు. ఎర్డోగాన్ నాటో కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎర్డోగాన్ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి టర్కీ అధికార పార్టీ జెండాలను ఊపుతూ, కారు హారన్లు మోగిస్తూ, ఆయన పేరును జపిస్తూ సంబరాలు చేసుకున్నారు.