
రూ.2 వేల నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపసంహరించుకోవడంపై కొన్ని వర్గాలు మళ్లీ గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాయని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. వేరే రాజకీయ పార్టీలను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని గులాబీ నేతలు విమర్శలు చేయడం పట్ల ఆమె మండిపడ్డారు.
నిజానికి ‘గులాబీ’ నోటు రద్దుతో గుండెలు బాదుకుంటున్నవాళ్లు ఎవరైనా ఉంటే అది తెలంగాణలోని అధికార ‘గులాబీ’ దళం తప్ప ఇంకెవరూ కాదని ఆమె ధ్వజమెత్తారు. గులాబీ నోటు రద్దు వల్ల సామాన్యులకు ఎలాంటి నష్టం కలగదని, గులాబీ రంగు నోటు పోతుందని గుండెలు బాదుకుంటున్న గులాబీ పార్టీకి మాత్రమే నష్టం కలుగుతుందని . ఆపార్టీ నేతలు పని గట్టుకొని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పెచ్చురిల్లిన అవినీతి, అక్రమార్జన తీరుని గమనిస్తే అధికారగణం దగ్గర తప్ప ఇంకెక్కడా ఈ రూ.2 వేల నోట్ల కుప్పలు కనిపించే పరిస్థితి లేదని ఆమె తెలిపారు. అందుకే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేకపోయినా ‘గులాబీ’ నేతలు మాత్రం గుబులెక్కి శివాలెత్తిపోతున్నరని ఆమె దుయ్యబట్టారు.
“రూ.2 వేల నోట్లకు ఉన్నది ‘గులాబీ’ రంగే కదా! బిఆర్ఎస్ పేర దేశమంతా తోరణాలు కట్టుకోండి. ఆ నోట్లను ఆర్ బీఐ ఉపసంహరించుకోకుంటే.. ఈ నోట్ల పంపిణీ దేశమంతా జరిపించేవారు మీరు’’ అంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు. 2016లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు జరిగినప్పుడే కేవలం తాత్కాలిక సర్దుబాటు కోసం రూ.2,000 నోటును ప్రవేశపెడుతున్నామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పిందని ఆమె గుర్తు చేశారు.
“అదీగాక కొద్దో గొప్పో నోట్లు ఉన్నవాళ్లు మార్చుకోవడానికి 4 నెలల సమయం కూడా ఇచ్చింది. ఈ నిర్ణయంతో సామాన్యులకి కలిగిన నష్టం ఏమీ లేకున్నా, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు కొందరు వ్యతిరేక ప్రచారానికి దిగారు’’ అని ఆమె ధ్వజమెత్తారు.
‘‘2016లో నోట్ల రద్దు జరిగినప్పుడు ఎన్ని నోట్లు మురికి కాలువల్లో కనిపించాయో.. ఎంత నల్లధనం అగ్నికి ఆహుతైందో చెప్పాల్సిన పని లేదు. ఇతర రాజకీయ పార్టీల్ని దెబ్బకొట్టడానికే ఈ నిర్ణయం జరిగిందని కొందరు అంటున్నారు. అదే నిజమైతే కర్ణాటక ఎన్నికలకి ముందే ఈ నిర్ణయం వెలువడి ఉండేది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
More Stories
మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలి
టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనకు పట్టించుకోని ప్రభుత్వం
బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్కు భూమి కేటాయింపును రద్దు!