బెంగాల్ లో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు స్వాధీనం

పశ్చిమబెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, నిషేధించిన బాణాసంచాను పోలీస్‌లు పట్టుకున్నారు. అక్రమంగా వీటిని తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై వంద మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 132 కేసులు నమోదు చేశామని అధికారులు మంగళవారం తెలిపారు.

సోమవారం ప్రారంభమైన ఈ దాడులు సోమవారం అర్ధరాత్రి, మంగళవారం వరకు కొనసాగాయి. ఇంతవరకు 34,000 కిలోల పేలుడు పదార్ధాలు, బాణాసంచా సాధీనం చేసుకోవడమైందని, వీటిని నిల్వచేసి వ్యాపారాలు సాగిస్తున్నారని దాదాపు 100 మందిని అరెస్టు చేశామని అధికారులు చెప్పారు. నాడియా, దక్షిణ, ఉత్తర 24 పరగణాలు ప్రాంతాల్లో ప్రధానంగా ఈ దాడులు జరిగాయి.

వివిధ జిల్లాలకు చెందిన పోలీస్‌లు ఎంతవరకు తమ జిల్లాల్లో పేలుడు పదార్ధాలను, బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారో ఈనెల 29 నాటికి రాష్ట్ర సెక్రటేరియట్‌కు నివేదికలు సమర్పించాలని కోరినట్టు చెప్పారు.

దాదాపు 8 రోజుల వ్యవధిలో గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా బాణాసంచా తయారీ, పేలుడు పదార్ధాల నిల్వ ఫలితంగా గోడౌన్ విధ్వంసం కావడం వంటి మూడు ప్రమాదాలు సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోవడంతో పోలీస్‌లు దాడులకు దిగారు. ఈనెల 16న పూర్బా మెడినిపూర్ లో పేలుడు సంభవించి 12 మంది చనిపోయారు. మాల్డా జిల్లాలో మంగళవారం కార్బైడ్ గొడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు చనిపోయారు.

ఈలోగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం దక్షిణ 24 పరగణాల జిల్లా బరియాపూర్ ఏరియా హరాల్ వద్ద బాజీ బజార్ (బాణాసంచా బజార్)ను మూసివేయించాలని మంగళవారం నిర్ణయించింది. ముందు జాగ్రత్తల చర్యగా బాణాసంచా వ్యాపారులంతా తమ వద్దనున్న ముడిపదార్ధాల నిల్వలను ఆయా పోలీస్‌స్టేషన్ల వద్ద అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది.