రూ. 2 వేల నోట్ల మార్పుపై ఆదాయపన్నునిఘా!


రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉపసంహరించుకున్న రూ 2 వేల  నోట్లను బ్యాంకులలో మార్చుకోవడం మంగళవారం ప్రారంభమైంది. ఎవరి దగ్గరైనా ఆ నోట్లు వుంటే సెప్టెంబరు 30 లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అంతవరకు బయట మార్కెట్‌లో కూడా అవి చలామణిలో ఉంటాయి.
దుకాణదారులు, వ్యాపారులు తీసుకోబోమని చెప్పడానికి వీల్లేదని
రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, గతంలో పెద్ద నోట్ల రద్దు అయినప్పుడు చాలామంది వ్యాపారులు, ధనవంతులు తమ వద్ద పేరుకుపోయిన బ్లాక్‌మనీని మార్చుకొనే ప్రయత్నం చేసిన విధంగా ఇప్పుడు కూడా అలాగే చేయడానికి అవకాశం ఉంది. అందుకనే ఆదాయపన్ను శాఖ అధికారులు బ్యాంకులలో జరుగుతున్న ఈ నోట్ల లావాదేవీలపై ఓ కన్నెసిన్నట్లు తెలుస్తున్నది.

ఎవరైనా సరే సెప్టెంబరు 30 వరకు రోజుకు పది నోట్లు చొప్పున రూ.20 వేలు బ్యాంకులో వేసి, దానికి సరిపడా మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. అలా చేస్తే నెలకు రూ.6 లక్షల వరకు మార్చుకోవచ్చు. అయితే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా అని తమవి కాని అరెవ్వరి డబ్బునో తమ ఖాతాలలో వేసుకొంటే ఇబ్బందులు తప్పకపోవచ్చని ఆదాయపన్ను శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

సెప్టెంబర్ 30 వరకు ప్రతి ఖాతాను ఆదాయపన్ను అధికారులు పరిశీలిస్తుంటారు. రెండు లక్షల రూపాయలలోపు రూ.2 వేల నోట్ల లావాదేవీలు ఉంటే సాధారణ అంశంగానే పరిగణిస్తారు. అంతకు మించి రూ.2 వేల నోట్లు వేసినట్టయితే వాటిపై సెక్షన్‌ 68 ప్రకారం వివరణ కోరతారని స్పష్టం చేస్తున్నారు. దానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో వివరించి, ఆధారాలు చూపాల్సి ఉంటుంది

గతంలో ఎన్నడూ చూపని ఆదాయం ఇప్పుడు చూపిస్తూ దానిపై ఆదాయ పెన్నుతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. జరిమానా ఆ లావాదేవీ  మొత్తంలో 84 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేశారనుకుంటే, దానికి సరిగ్గా లెక్కలు చెప్పకపోతే రూ.8.4 లక్షలు ఐటీ విభాగానికి కట్టాల్సి ఉంటుంది.

పొరపాటున ఏ స్నేహితుడికో సాయం చేద్దామనే ఆలోచనతో వారి డబ్బులు తమ ఖాతాలో వేసుకుంటే తగు మూల్యం చెల్లింపవలసి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఈ విచారణలో మనీ లాండరింగ్‌ జరిగిందని ఐటీ శాఖ భావిస్తే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు.

ధనవంతులైన మిత్రులు తమ దగ్గరున్న రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి మన పేరుతో కొత్తగా ఇంకో బ్యాంకులో ఖాతా తెరిచినా ప్రమాదం ముంచుకు వస్తుందని చెబుతున్నారు. మీకేమి భయం అవసరం లేదని, సెప్టెంబరు నెల ముగియగానే ఆ ఖాతా క్లోజ్‌ చేస్తామని, ఏ సమస్య రాదని చెబుతారు. అయితే, ఇలా కొత్తగా ప్రారంభించే ఖాతాలు, అందులో వేసే మొత్తాలను బ్యాంకులతో పాటు ఐటీ శాఖ కూడా ట్రాక్‌ చేస్తుందని గుర్తు చేసుకోవాలి.   

ఇప్పుడు ప్రతి బ్యాంకు ఖాతాకు ఆధార్‌ లింక్‌ ఉంటుంది కాబట్టి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నా ఒక్కరి పేరుపైనే చూపిస్తాయని గమనించాలి. కొంతమంది ఇలాంటి డబ్బులను ఐటీ రిటర్న్‌లలోను చూపించడానికి యత్నిస్తున్నారు. పరిధికి మించి బ్యాంకు ఖాతాలో రూ.2 వేల నోట్లను డిపాజిట్‌ చేస్తే సెక్షన్‌ 115-బీబీఈ ప్రకారం మూడేళ్ల తరువాత కూడా ఆ రిటర్న్‌లను పునః సమీక్ష చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుసుకోవాలి.