సమీర్ వాంఖడేకు బిగుస్తున్న సీబీఐ ఉచ్చు

గతంలో సంచలనం సృష్టించిన ముంబై క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌పై డ్రగ్స్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన కలకలంరేపిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు సీబీఐ ఉచ్చు బిగిస్తోంది.  ఆర్యన్ ఖాన్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సమీర్ వాంఖడే రూ. 25 కోట్లు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.

సమీర్ వాంఖడేతోపాటు మరో నలుగురిపైనా సీబీఐ కేసు నమోదు చేయగా, తాజాగా కేసు ఎఫ్ఐఆర్ బయటికి వచ్చింది. ఈ కేసులో సమీర్ వాంఖడే విదేశీ పర్యటనలు, విలువైన చేతి గడియారాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను వాంఖడే చెప్పలేదని ఎఫ్ఐఆర్‌లో తెలిపింది. డిపార్ట్‌మెంట్‌కు చెప్పకుండా చేతిగడియారాలు కొనుగోలు, అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు.

ఆ ఖర్చుల వివరాలకు, వాంఖడే చెప్పిన వివరాలకు పొంతన లేకుండా ఉందని సీబీఐ తెలిపింది. ఇటీవల సమీర్ వాంఖడే నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. ఈ ఎఫ్ఐఆర్‌లో వాంఖడేతో పాటు అప్పటి అధికారులు, సాక్షి కేపీ గోసావి, అతడి సన్నిహితుడు సానవిల్లే డిసౌజా పేర్లు ఉన్నాయి. లంచాన్ని రూ.25 కోట్ల నుంచి రూ.18 కోట్లకు తగ్గించారని, అడ్వాన్సుగా రూ.50 లక్షలు గోసావి, డిసౌజా తీసుకుని తర్వాత తిరిగిచ్చేశారని పేర్కొంది.

క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ఖాన్ వద్ద మాదకద్రవ్యాలు ఉన్నాయని షారూక్ కుటుంబాన్ని బెదిరించి రూ.  25 కోట్లు డిమాండ్ చేశారని సీబీఐ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసింది. ఈ కేసులో ఆర్యన్‌ఖాన్ 22 రోజులు జైలులో ఉన్నాడు. సరైన ఆధారాలు సేకరించడంలో విఫలయ్యారని ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌ బయటికి వచ్చాడు.

 
తర్వాత వాంఖడేపై పలు ఆరోపణలు రావడంతో జోనల్‌ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేసి విచారణ చేపట్టారు. సమీర్ వాంఖడేపై వచ్చిన ఆరోపణల్లో ఎక్కువ మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చేశారు. లంచం ఆరోపణలో నవాబ్ మాలిక్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
 
అయితే, సమీర్ వాంఖడేపై వస్తున్న ఆరోపణలను ఆయన భార్య క్రాంతి రేడ్కర్ ఖండించారు. సమీర్ వాంఖడేకు వ్యతిరేకంగా వస్తున్న విమర్శలన్నీ నిజాలు కావని అందరికీ తెలుసని ఆమె చెప్పారు. కాగా, నిజాయితీగా ఉన్నందుకు సీబీఐ కేసు బహుమతి అని సమీర్ వాంఖడే పేర్కొంటూ, తన దేశభక్తికి దక్కిన గౌరవం ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
తన ఇంట్లో 18 మంది సీబీఐ అధికారులు 12 గంటలు సోదాలు చేశారని తెలిపారు. అందులో రూ.23 వేలు నగదు, నాలుగు ఆస్తి పత్రాలు లభించాయని.. అవి తాను ఉద్యోగంలో చేరడానికి ముందునుంచే ఉన్నాయని స్పష్టం చేశారు.