మే నెలలో విదేశీ పెట్టుబడులు రూ. 23,152 కోట్లు

మన ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్ల ఆసక్తి పెంచుకున్న విదేశీ పెట్టుబడిదారులు మే నెలలో ఇప్పటిదాకా రూ. 23,152 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. యూఎస్​ ఫెడరల్​ రిజర్వ్​ వడ్డీ రేట్లను మరోసారి పెంచే అవకాశం లేదని తెలవడంతోపాటు, దేశీయంగా మార్కెట్లో అనుకూలమైన పరిస్థితులు ఉండటం వల్లే కొనుగోళ్లకు ఎఫ్​పీఐలు ఇష్టపడుతున్నారు.
 
2023 లో ఎఫ్​పీఐలు రూ. 8,572 కోట్ల కొనుగోళ్లతో నెట్​ బయ్యర్లుగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎఫ్​పీఐల కొనుగోళ్ల దూకుడు ఇలాగే కొనసాగుతుందనే భావిస్తున్నారు.  రూపాయి బలపడటంతోపాటు, మరోవైపు డాలర్​బలహీనం ​ అవుతుండటంతో ఎఫ్​పీఐలు సమీప భవిష్యత్​లో మన మార్కెట్లో కొనుగోళ్లనే చేస్తారని చెబుతున్నారు.
 
డిపాజిటరీల డేటా ప్రకారం మే 2–మే 12 మధ్య కాలంలో ఎఫ్​పీఐలు ఏకంగా రూ. 23,152 కోట్లను మన ఈక్విటీ మార్కెట్లో వెచ్చించాయి. ఇంతకు ముందు ఏప్రిల్​నెలలో రూ. 11,630 కోట్లు, మార్చి నెలలో రూ. 7,936 కోట్లను ఎఫ్​పీఐలు పెట్టాయి. ఆర్ధిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో చూస్తే నికరంగా రూ. 34,000 కోట్ల పెట్టుబడులను ఎఫ్​పీఐలు వెనక్కి తీసుకున్నాయి.
 
యూఎస్​ రీజినల్​ బ్యాంకులు రిస్క్​లో పడటంతో మార్చి నెలలో కొంత అనిశ్చితి నెలకొందని, గ్లోబల్​గా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో  నమ్మకం పెరిగి ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్​పీఐల పెట్టుబడులు అధికమయ్యాయని చెబుతున్నారు. మే నెలలో డెట్​ మార్కెట్లోనూ రూ. 68 కోట్లను ఎఫ్​పీఐలు పెట్టుబడిగా పెట్టారు. ఫైనాన్షియల్​ సెక్టార్లో జోరు కొనసాగిస్తూనే, క్యాపిటల్​ గూడ్స్​, ఆటో సెక్టార్లలోనూ ఎఫ్​పీఐలు పెట్టుబడులు పెడుతున్నారు.​
 
భారతీయ ఈక్విటీ షేర్ల విలువ గరిష్ఠానికి చేరడంతో 2023 మొదటి మూడు నెలల్లో ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగించారు. మరోవైపు చైనాలో కరోనా లాక్‌డౌన్ తగ్గి మళ్లీ పనులు ప్రారంభించడంతో ఇన్వెస్టర్లు బీజింగ్ వైపు మొగ్గుచూపారు. కానీ ఇప్పుడు ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్లకు వర్ధమాన దేశాల్లో భారత్ మరోసారి అనుకూలమైన దేశంగా మారిందని భావిస్తున్నారు.
 
 అదే సమయంలో భారతదేశంలో స్థూల ఆర్థిక అంశాలు మెరుగవడడం కూడా విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి కారణమైంది. ఏప్రిల్‌లో ఆఖరి వారాల్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ప్రారంభమైంది.