రాహుల్‌ గాంధీకి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి బుధవారం ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. ముందస్తు అనుమతి లేకుండా యూనివర్సిటీలో ప్రవేశించడంపై నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ గతవారం ఢిల్లీ యూనివర్సిటీలోని పీజీ మెన్స్‌ హాస్టల్‌కు చేరుకున్నారు.
 
ఇక్కడ విద్యార్థులతో దాదాపు గంట సమయం గడిపారు. ఈ సందర్భంగా విద్యార్ళుతో కలిసి మెస్‌లో భోజనం చేశారు. హాస్టల్‌ రూల్‌ 15.13 ప్రకారం హాస్టల్‌ చదువుకునే వారు తప్ప మరెవరూ ఇతర కార్యకలాపాల్లో పాల్గొనకూడదని నోటీసుల్లో పేర్కొంది.  వాస్తవానికి మే 5న రాహుల్‌ గాంధీతో పాటు పలువురు హాస్టల్‌కు చేరుకొని, దాదాపు గంట సేపు మెస్‌లో సమయం గడిపారు.
 
ఆయనతో ఉన్న వారంతా హాస్టల్‌కు చెందిన వారు కాదని, ముందస్తు అనుమతి లేకుండా పర్యటించారని, కనీసం హాస్టల్‌ నిర్వాహకులకు, స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఏ విజిటర్‌ అయినా మొదట హాస్టల్‌ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
రాహుల్‌ పర్యటన అనంతరం మే 6న డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్ అండ్‌ ప్రోక్టర్‌ సమక్షంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జడ్‌ప్లస్‌ భద్రత కలిగిన జాతీయ పార్టీ నాయకుడి ప్రవర్త గౌరవానికి మించిందని తీర్మానించారు. మూడు వాహనాల్లో హాస్టల్‌లోకి ప్రవేశించడం నిబంధనలు ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.
 
హాస్టల్‌లోని విద్యార్థులు, సిబ్బంది, అధికారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, క్రమశిక్షణతో కూడిన అంశమని డీయూ అధికారి ఒకరు పేర్కొన్నారు. యూనివర్సిటీకి రావాలనుకున్న సమయంలై సరైన ప్రోటోకాల్‌ అవసరమని, భవిష్యత్తులో క్యాంపస్‌లోకి అనధికారికంగా అడుగుపెట్టకుండా ఉండేలా ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.