పిఎం కేర్స్‌కు విదేశాల నుంచి రూ.535 కోట్ల విరాళం

పిఎం కేర్స్‌కు గత మూడేళ్ల కాలంలో విదేశాల నుంచి రూ.535 కోట్ల విరాళం అందింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సాయం అందించేందుకు పిఎం కేర్స్‌ పేరిట మోదీ  ప్రభుత్వం 2020లో నిధిని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.  ఈ నిధికి సంబంధించిన వసూళ్లు, చెల్లింపుల ఖాతాల ప్రకారం విదేశాల నుంచి 2019-20లో రూ.0.40 కోట్లు, 2020-21లో రూ.494.92 కోట్లు, 2021-22లో రూ.40.12 కోట్ల మేర విరాళాలు లభించాయి.
ఈ మూడు ఆర్థిక సంవత్సరాలలో విదేశీ విరాళాల నుంచి రూ.24.85 కోట్ల వడ్డీ ఆదాయం కూడా లభించింది.  కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న 2020-21లో విదేశాల నుంచి అధికంగా విరాళాలు వచ్చాయి. రెండో దశ కరోనా ప్రబలిన 2021-22లో మాత్రం విరాళాల జోరు తగ్గింది. 2021-22లో విదేశీ విరాళాలతో పాటు స్వచ్ఛంద విరాళాలు కూడా తగ్గిపోయాయి.
 
2020-21లో రూ.7,183.77 కోట్ల మేర స్వచ్ఛంద విరాళాలు లభించగా 2021-22లో రూ. 1,896.76 కోట్లు మాత్రమే వచ్చాయి. 2019-20లో స్వచ్ఛంద విరాళాల రూపంలో రూ.3,075.85 కోట్లు వచ్చాయి. విదేశీ, స్వచ్ఛంద విరాళాలు కలిసి ఈ మూడేళ్ల కాలంలో రూ. 12,691.82 కోట్లు లభించాయి.
 
పిఎం కేర్స్‌కు వచ్చే విరాళాలను ఆదాయపన్ను, ఎఫ్‌సిఆర్‌ఎ నుంచి మినహాయించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వెంటిలేటర్లు, వలసవాదుల సంక్షేమం, రెండు కరోనా ఆస్పత్రుల ఏర్పాటు, ఆక్సిజన్‌ ప్లాంట్లు, వాక్సిన్‌ సేకరణ, ఇతర కోవిడ్‌ సంబంధ సరఫరాల కోసం ఈ నిధి నుండి చెల్లింపులు జరిపినట్లు ఖాతాలో చూపారు.