తెలంగాణ ఎన్నికల బరిలో గల్ఫ్ అమరుల భార్యలు

మందా భీమిరెడ్డి, గల్ఫ్ కార్మికుల వ్యవహారాల నిపుణులు 
◉ రాజకీయ శక్తిగా గల్ఫ్ కార్మికులు, ◉ భారీ నామినేషన్లకు సన్నాహాలు
గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల భార్యలు (గల్ఫ్ విడోస్) వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి గల్ఫ్ శ్రామికుల హక్కుల ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గల్ఫ్ రిటనీలు, గల్ఫ్ కార్మిక కుటుంబాల సంఖ్య అధికంగా ఉన్న 32 అసెంబ్లీ సెగ్మెంట్లలో ‘గల్ఫ్ విడోస్’ తో పాటు గల్ఫ్ బాధితుల కూడా భారీగా నామినేషన్లు వేయడానికి సిద్ధం అవుతున్నారు.
 
ఈ ఆలోచన ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు దారితీయనున్నది.  సంవత్సరానికి 200 మంది చొప్పున గత తొమ్మిదేళ్లలో గల్ఫ్ దేశాలలో తెలంగాణ వలస కార్మికులు 1,800 మందికి పైగా చనిపోయారు. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో శవపేటికల రవాణాకు అనుమతి ఇచ్చే రిజిస్టర్ ఇందుకు సాక్ష్యం. 
గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని మాట తప్పినందుకు కేసీఆర్ పై గల్ఫ్ మృతుల కుటుంబాలు కోపంగా ఉన్నాయి. కరోనా కష్ట కాలంలో హోటల్ క్వారంటయిన్ పేరిట రూ.8 వేల చొప్పున వసూలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంపై, అధిక విమాన చార్జీలు వసూలు చేసినందుకు కేంద్ర ప్రభుత్వంపై గల్ఫ్ రిటనీలు గుర్రుగా ఉన్నారు.

బతుకుదెరువు కోసం గంపెడాశతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వలస జీవుల గోడును బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోవడం లేదు. తమ సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ శ్రామికులు రాజకీయ పోరాట పంథాను ఎంచుకున్నారు.
 
అధికార, విపక్ష పార్టీల చుట్టూ తిరిగి విసిగి వేసారిన గల్ఫ్ వలస జీవులు ఎన్నికలను ఎత్తుగడగా గల్ఫ్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని సమాయత్తం అవుతున్నారు. గల్ఫ్ జేఏసి,  గల్ఫ్ వర్కర్స్  పొలిటికల్ ఫోరం, వివిధ కార్మిక, ప్రజా సంఘాలతో, మేధావులతో చర్చలు జరుపుతున్నారు. 
గల్ఫ్‌ దేశాలలో తెలంగాణ కూలీలు 15 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా. గత పదేళ్లలో ఎడారి దేశాల నుండి మరో 15 లక్షల మంది వాపస్ వచ్చి గ్రామాలలో సరైన ఉపాధి లేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక వనరులతో పరిశ్రమలు ఏర్పాటు, వ్యవసాయ రంగానికి మద్దతు ఇస్తే వలస సమస్యలు కొంతవరకు తీరేవి.
 
32 సీట్లలో గల్ఫ్ కుటుంబాలు నిర్ణయాత్మకం
 
వీరందరి కుటుంబ సభ్యులు కలిస్తే ఒక కోటి వరకు గల్ఫ్ ఓటు బ్యాంకు ఉన్నది. తెలంగాణలో 32 అసెంబ్లీ నియోజకవర్గాలలో గల్ఫ్ కుటుంబాల ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నట్లు పలువురు రాజకీయ వ్యూహకర్తలు ఇదివరకే ఆయా పార్టీలకు తేల్చి చెప్పారు.  
 
కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ ఇవ్వనందుకు బీఆర్ఎస్ పై  గల్ఫ్ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడం ఒక ఆలోచన కాగా, బీజేపీ, కాంగ్రెస్,  బీఎస్పీ, ఫార్వర్డ్  బ్లాక్ పార్టీలు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పడం మరో కోణం.
అధిక ప్రభావం గల అసెంబ్లీ నియోజకవర్గాలు: నిర్మల్, ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి (ఎస్సీ), ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్. ఒక మోస్తరు ప్రభావం గల అసెంబ్లీ నియోజకవర్గాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు (ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్తల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి

గల్ఫ్ లో ఉన్నా.. ఊరిలో పట్టు  

సప్త సముద్రాలు దాటి గల్ఫ్‌ దేశాలకు వలసపోయిన కార్మికుల ఓటు బ్యాంకు.. తెలంగాణ గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్ లో రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తోంది. గెలుపోటములను శాసించే సత్తా ఉన్న గల్ఫ్‌ కుటుంబాలపై ప్రధాన విపక్ష రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ దృష్టి సారించాయి. బీఆర్ఎస్ మాత్రం గల్ఫ్ కుటుంబాలను లెక్కలోకి తీసుకోవడం లేదు.

తెలంగాణ ఉద్యమ సమయంలో “బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి” అనే నినాదం ఒక పవర్ ఫుల్ మిస్సయిల్ లాగా పనిచేసింది. ఇప్పుడు అదే మిస్సయిల్ తిరగబడింది. కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందున బీఆర్ఎస్ పార్టీకి గల్ఫ్ కార్మికుల కుటుంబాలు దూరమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపడానికి సిద్ధం అవుతున్నారు.