గాంధీభవన్ ను ముట్టడించిన బజరంగ్ దళ్

బజరంగ్ దళ్ ను నిషేధిత ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐతో పోల్చడాన్ని నిరసిస్తూ బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. బుధవారం ఉదయం 10:30 నుంచి విడతలు విడతలుగా నాలుగుసార్లు గాంధీభవన్ ముట్టడించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ముస్లిం సంతుష్టీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ హిందువులపై విషం చిమ్మడాన్ని నిరసిస్తూ బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది.
 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలతో పాటు కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసింది. బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు నేతృత్వంలో భాగ్యనగర్ లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ను ముట్టడించారు. వందలాది మంది పోలీసులు మోహరించినా మెరుపు దాడికి దిగారు.
 
ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బజరంగ్దళ్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచారు. అక్రమ కేసులు బనాయించి పలు పోలీస్ స్టేషన్ లకు తిప్పారు. బొల్లారం, బేగంబజార్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. భాగ్యనగరంలో దాదాపు 300 మంది కార్యకర్తలు ముట్టడిలో పాల్గొన్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. రాత్రి నుంచి పహారాల్లో ఉన్న పోలీసులను తప్పించుకొని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు గాంధీభవన్ చేరుకున్నాడు.
 
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం చుట్టుముట్టి శివరాములును బంధించాలని చూసినా పోలీసుల కళ్ళు కప్పి కార్యాలయం నుంచి గాంధీభవన్ చేరుకున్నాడు. దీంతో ఈస్ట్ జోన్ డిసిపి సునీల్ దత్, మిగతా పోలీస్ యంత్రాంగం వీహెచ్‌పీ  కార్యాలయానికి వచ్చి కార్యాలయం అంతా తనిఖీలు చేశారు. కింది స్థాయి సిబ్బందిని డిసిపి తీవ్రంగా మందలించారు.

ఉగ్రవాద మూలాలు కలిగిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా  (PFI) వంటి ఉగ్రవాద సంస్థతో బజరంగ్ దళ్ ను పోల్చడం దుర్మార్గమని శివరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు.  హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్రను కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేసుకుందని మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హిందువులపై మరోసారి విషం చిమ్మిందని ధ్వజమెత్తారు.

 
ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ ను ఉగ్రవాద సంస్థ అయిన  పిఎఫ్ఐ తో పోలుస్తూ బజరంగ్ దల్ పై నిషేధం విధిస్తామనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.  హిందువులంతా సంఘటితమై కాంగ్రెస్ ను తుదముట్టించాలని, ప్రతి హిందువు స్పందించి కాంగ్రెస్ ముక్తభారత్ చేయాలని పిలుపిచ్చారు.