గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్ కు దక్కని ఊరట

‘మోదీ ఇంటి పేరు’  వ్యాఖ్యల వ్యవహారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరోసారి నిరాశ ఎదురైంది. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో దోషిగా నిర్దారిస్తూ దిగువ కోర్టు విధించిన శిక్షపై ‘తాత్కాలిక స్టే’ ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు మంగళవారంనాడు నిరాకరించింది. రాహుల్ పిటిషన్‌పై వేసవి సెలవుల అనంతరం, జూన్ 4వ తేదీ తరువాత తీర్పు ఇవ్వనుంది.

తనకు విధించిన శిక్షపై తీర్పు ప్రకటించేంత వరకూ తాత్కాలిక స్టే ఇవ్వాల్సిందిగా రాహుల్ తన పిటిషన్‌లో కోరారు. రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోరగా జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ ధర్మాసనం అందుకు నిరాకరించింది. తమ నిర్ణయాన్ని హైకోర్టు సెలవుల తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
 
ఫిర్యాదు దారు పూర్ణేష్ మోదీ తరఫున సీనియర్ న్యాయవాది నిరుపమ్ నన్వతి వాదనలు వినిపించగా, రాహుల్ గాంధీ తరఫున అభిషేక్ సింఘ్వి వాదించారు. వీరి వాదనల్లో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ‘రాహుల్ గాంధీని కోర్టు లేదా ఫిర్యాదుదారు అనర్హులుగా ప్రకటించ లేదు. పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం అతనిపై అనర్హత వేటు పడింది. దానికి కోర్టులకు ఏం సంబంధం. రాహుల్ గాంధీ తనను తాను బాధితుడిగా చెప్పుకుంటున్నారు’ అని నిరుపమ్ నన్వతి వాదించారు.
 
“2019లో కర్నాటకలోని కోలార్‌ లో జరిగిన బహిరంగ ర్యాలీలో “దొంగలందరూ మోదీ ఇంటి పేరుతో ఎందుకు ఉంటున్నారు” అని రాహుల్ గాంధీ అన్నారు. మార్చి 23న సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించబడిన తర్వాత కూడా రాహుల్ గాంధీ తాను చేసిన ప్రకటనల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. విలేకరుల సమావేశాన్ని నిర్వహించినప్పుడు కూడా కోర్టు వేసిన శిక్ష తనకు ‘బహుమతి’ అని రాహుల్ గాంధీ చెప్పారు. బయట బహుమతి అని చెప్పి.. కోర్టులో బాధితుడిగా చెప్పుకోవడం ఏంటి’ అని నిరుపమ్ నన్వతి ప్రశ్నించారు.
 
మరో వైపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ‘రాహుల్ గాంధీని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ కేసులో శిక్షపడిన కారణంగా ఆయనపై అనర్హత వేటు పడింది. దీని కారణంగా రాహుల్ గాంధీని ఎన్నుకున్న ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రస్తుత సెషన్, వచ్చే సెషన్‌లో ఆయన తన ప్రజల తరఫున గొంతు వినిపించలేదు’ అని తెలిపారు.
 
రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం.. ఆయనకు వాక్ స్వాతంత్ర్య హక్కు ఉంది. ఆయనకు శిక్ష వేయడం అంటే.. వాక్ స్వాతంత్య్రాన్ని తొక్కిపెట్టినట్టే’ అభిషేక్ సింఘ్వీ తన వాదనను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.