జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత పొరుగు రాష్ట్రంలో పోటీ పడ్డ తొలి ఎన్నికల్లోనే బీఆర్ఎస్ చతికిల పడింది. మహారాష్ట్రలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ పార్టీగా మారిన తర్వాత మొదటగా మహారాష్ట్రపై ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికి మూడు బహిరంగసభలలో ప్రసంగించారు. త్వరలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో అక్కడ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
జాతీయ పార్టీగా మారినప్పటికీ ఇప్పటి వరకు మహారాష్ట్ర మినహా మరే రాష్ట్రంలో కేసీఆర్ బహిరంగసభలు పెట్టడం గాని, ఎన్నికల సన్నాహాలు ప్రారంభించడం గాని చేయకపోవడం గమనార్హం. తెలంగాణ అభివృద్ధిని చూసి అక్కడి నేతలు, ప్రజలు కేసీఆర్ పట్ల ఆకర్షితులవుతున్నట్లు ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే, తెలంగాణ పక్కనే ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని భోకర్ తాలూకాలో ఉన్న ప్రఖ్యాత భోకర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ 18 డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పరాజయం పాలయ్యారు. ఒక్కటంటే ఒక్క డైరెక్టర్ పదవిలో కూడా నెగ్గలేకపోయింది.
ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ మద్దతుదారులు 13 స్థానాలు గెలుచుకోగా, ఎన్సీపీకి రెండు వచ్చాయి. బీజేపీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు డైరెక్టర్ పదవులను కైవసం చేసుకున్నారు. బిఆర్ఎస్ గా ఏర్పడిన తర్వాత, తెలంగాణ బైట మొదటిసారిగా పోటీచేయడం గమనార్హం.
ఈ మార్కెట్పై పట్టున్న నాగ్నాథ్ సింగ్ ఇటీవలే కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. భోకర్ మార్కెట్కు నాందేడ్ జిల్లాలోనే అతిపెద్దదనే పేరుంది. ఈ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేసింది. చాలా మంది రాజకీయ ప్రముఖులు ఈ మార్కెట్ కమిటీ ఎన్నికల నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ముందు నుంచి ఈ కమిటీలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన(ఉద్ధవ్ వర్గం), బీజేపీకి మధ్య త్రికోణ పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఇందుకు కారణం ఈ మార్కెట్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నియోజకవర్గం(భోకర్) పరిధిలో ఉండడంతో, ఆయన ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారు. అటు స్థానిక బీజేపీ ఎంపీ ప్రతాప్ పాటిల్ చికిల్కర్ కూడా వారం రోజులుగా భోకర్లోనే ఉంటూ అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. కొంతకాలంగా మహారాష్ట్రలో రాజకీయ కార్యకలాపాలను విస్తరిస్తూ బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది.
బీఆర్ఎస్ పార్టీ సరిహద్దు గ్రామాల్లో భారీగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తోంది. ఇటీవల కేసీఆర్ మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో వచ్చిన భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.
కానీ, నాగ్నాథ్ సింగ్ నేతృత్వంలో బరిలోకి దిగిన 18 మంది అభ్యర్థులు ఉచిత హామీలను ప్రకటించినా ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. బీఆర్ఎస్ ఇక్కడ తమ మద్దతుదారులను గెలిపిస్తే తెలంగాణలో మాదిరిగా ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తామని హామీలు ఇచ్చింది.
బీఆర్ఎస్ ఆగమనంతో ఫలితాలు తారుమారవుతాయని భావించినా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన శివసేన(ఉద్ధవ్ఠాక్రే) వర్గం కూడా ఈ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది.
More Stories
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు
కర్ణాటకకు కుదిపేస్తున్న రేవణ్ణ సెక్స్ వీడియోలు
అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు