పశ్చిమ బెంగాల్లో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో మతపరమైన హింస చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రాళ్లు రువ్వడం, దహనం చేయడం, కొట్లాటలు వంటి ఘటనలు జరిగాయి.
పోలీసు వాహనాలు, దుకాణాలు, ప్రజా రవాణాకు సంబంధించిన వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా హౌరా, హుగ్లీ, దల్ఖోలాలో జరిగిన హింసాత్మక ఘటనలపై కోల్కతా హైకోర్టు ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో.. విచారణకు సంబంధించి అవసరమైన అన్ని పత్రాలు, ఎఫ్ఐఆర్, సీసీటీవీ ఫుటేజీలను 2 వారాల్లోగా ఎన్ఐఏకి అందజేయాలని కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై ఎన్ఐఎ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే సుబేందు అధికారి పిల్ దాఖలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ లభించిన తర్వాత ఎన్ఐఏ కేసు దర్యాప్తును ప్రారంభించనుంది. పశ్చిమ బెంగాల్లో రామ నవమి రోజున హౌరా, నార్త్ దినాజ్పూర్, ఇస్లాంపూర్లో ఊరేగింపులు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ ఘర్షణలు జరిగాయి. ఓ యువకుడు చనిపోయాడు. ఆ తర్వాతి రోజుల్ హౌరా, రిస్దా మినహా అనేక చోట్ల శోభా యాత్రలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఘర్షణకు దిగిన వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ విషయంపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. టీఎంసీ, బీజేపీ రెండూ హింసను ప్రోత్సహిస్తున్నాయని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. రామనవమి వేడుకల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. హౌరా, ఖరగ్పూర్, బరాక్పూర్, భద్రేశ్వర్, సిలిగురి, అసన్సోల్లలో వేలాది మంది ప్రజలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ ఊరేగింపుల్లో పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో రామనవమి ఊరేగింపులపై దుండగులు దాడి చేశారని ఆరోపించిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) పరిగణలోకి తీసుకుంది. ఆ తర్వాత హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
More Stories
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొవిషీల్డ్ పై దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్