64 ఏళ్ల తర్వాత దలైలామాకు రామన్ మెగసెసే పురస్కారం

టిబెటన్ ఆధ్యాత్మిక నేత దలైలామాకు 1959లో ప్రకటించిన రామన్ మెగసెసే పురస్కారం 64 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా బుధవారం అందుకున్నారు. ఫౌండేషన్ సభ్యులు వ్యక్తిగతంగా పురస్కారాన్ని దలైలామా నివాసంలో అందజేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.  ఫిలిప్పీన్స్‌లోని రామన్ మెగసెసే అవార్డు సభ్యులు ఈ పురస్కారాన్ని అందించారు.

టిబెటన్ కమ్యూనిటీ పవిత్ర మతాన్ని రక్షించడంలో దీటైన పోరాటానికి గుర్తింపుగా దలైలామాకు ఈ పురస్కారం అందించినట్లు దలైలామా కార్యాలయం తెలిపింది. ఆయనకు లభించిన మొదటి అంతర్జాతీయ పురస్కారం ఇదే కావడం గమనార్హం.  రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుసున్నా బి అఫాన్, ఫౌండేషన్ ట్రస్టీ ఎమిలీ ఎ అబ్రేరా మెగసెసే పురస్కారాన్ని వ్యక్తిగతంగా అందించడానికి దలైలామాతో సమావేశమైనట్లు తెలిపారు.

దలైలామా 1959లో టిబెట్‌ను విడిచిపెట్టి అప్పటి నుంచి భారతదేశంలో నివసిస్తున్నారు. జులై 6, 1935న ఈశాన్య టిబెట్ ప్రాంతంలోని ట్యాక్స్టర్ అనే కుగ్రామంలో జన్మించిన ఆయనను రెండేళ్ల వయస్సులోనే 13వ దలైలామాగా ప్రకటించారు. ఆయనతో పాటు సుమారు 80,000 మంది టిబెట్ ప్రజలు భారత్, నేపాల్, భూటాన్ లలోని 54 ప్రాంతాలలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.

రామన్ మెగసెసే పురస్కారాన్ని ఆసియా నోబెల్ బహుమతిగా పిలుస్తారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పాలన దక్షతకు గుర్తింపుగా ఆయన పేరిట ఈ వార్షిక అవార్డును ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సమ్మతితో న్యూయార్క్ నగరంలోని రాక్‌ఫెల్లర్ బ్రదర్స్ ధర్మకర్తలుగా 1957లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు