పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలిపేయాలంటూ వేసిన స్టే పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ ఆయన తాజాగా గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
‘మోడ్’ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు రాహుల్గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ గతంలో తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అంటూ 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో రాహుల్ వ్యాఖ్యానించారు.
రాహుల్ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేయడంతో ఈ కేసు వ్యవహారం మొదలైంది. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని పై కోర్టులో సవాల్ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్ మంజూరు చేసింది.
ఆ తర్వాత రాహుల్పై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారని గుర్తు చేసింది. అనంతరం రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని.. తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న ఇరు పక్షాల వాదనలు విని 20న తీర్పు వెలువరించింది. తాజాగా దీనిని సవాల్ చేస్తూ రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
More Stories
పాక్ వద్ద అణుబాంబు… గౌరవించాల్సిందే… ఓ కాంగ్రెస్ నేత!
ఎన్డీయేలో చేరమని పవార్, ఠాక్రేలకు మోదీ ఆహ్వానం
అర్వింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్