మనీశ్ సిసోడియాపై సీబీఐ చార్జిషీటు.. నిందితుల్లో కవిత ఆడిటర్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం నలుగురిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒక చార్జిషీట్‌ దాఖలు చేయగా, దానికి అనుబంధంగా మంగళవారం దాఖలు చేసిన చార్జిషీటులో సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆడిటర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును, మరో ఇద్దరిని నిందితుల జాబితాలో చేర్చింది.

మొత్తం 209 పేజీలతో దాఖలు చేసిన ఈ చార్జిషీటుతో కేసు ముగిసిపోలేదని, మరికొందరి పాత్రపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని కోర్టుకు సీబీఐ చెప్పినట్టుగా తెలిసింది. మనీశ్ సిసోడియా, గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ దల్‌ను నిందితులుగా పేర్కొంటూ ఐపీసీ సెక్షన్ 120(బీ), 201, 420తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7(ఏ), 8, 13 ప్రకారం అభియోగాలు నమోదు చేసింది.

అలాగే నాటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు మరో నలుగురిని అనుమానితులుగా పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను విచారణకు పిలిచిన సీబీఐ, అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన నుంచి అమలు చేయడం వరకు జరిగిన అక్రమాలు, అవకతవకల్లో సిసోడియానే ప్రధాన కుట్రదారుడని సీబీఐ ఆరోపిస్తోంది.

ఇదే కేసులో మనీలాండరింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అభియోగాలు మోపినవారిలో ఆడిటర్ బుచ్చిబాబు ముందే బెయిల్ తీసుకోవడంతో ఆయన బయటే ఉన్నారు. అర్జున్ పాండేను అరెస్టు చేయాల్సి ఉందని స్పెషల్ కోర్టుకు సీబీఐ తెలియజేసింది.

తాము సేకరించిన డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన వెంటనే వాటిని కోర్టుకు సమర్పిస్తామని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ చార్జిషీటును పరిగణలోకి తీసుకునే విషయంపై మే 12న విచారణ చేపడతామని స్పెషల్ కోర్టు తెలిపింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటి వరకు మొత్తం 11 మందిపై చార్జిషీటు దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్‌లో నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిని నిందితులుగా పేర్కొన్న సీబీఐ, గత ఏడాది నవంబర్ 25న దాఖలు చేసిన తొలి చార్జిషీటులో విజయ్ నాయర్‌తో పాటు మరో ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు మోపింది.

ఇదే కేసులో తాజాగా సీబీఐ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచి ప్రశ్నించింది. అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే ప్రశ్నించిన సీబీఐ, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. వీరిద్దరితో పాటు కేసుతో సంబంధం ఉన్న పలువురు సాక్షులు, అనుమానితులను ప్రశ్నించి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసుకుంది. అయితే అనుబంధ చార్జిషీటుతో కథ ముగిసిపోలేదని, ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించడంతో ఈ దర్యాప్తు ఎంతవరకు ముందుకెళ్తుందన్న ఉత్కంఠ నెలకొంది.